Skip to content
జాతీయం వార్తలు

పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత మాజీ మంత్రి పదంసింగ్ పాటిల్‌ సహా నిందితులందరూ నిర్దోషులుగా విడుదల!

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత మాజీ మంత్రి పదంసింగ్ పాటిల్‌ సహా నిందితులందరూ నిర్దోషులుగా విడుదల!

Special CBI Court Acquits Padamsinh Patil in High-Profile 2006 Murder Case

మహారాష్ట్ర రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్ ,ఆయన డ్రైవర్ సమద్ కాజీల డబుల్ మర్డర్ కేసులో ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్‌తో సహా నిందితులుగా ఉన్న మొత్తం తొమ్మిది మందిని ప్రత్యేక న్యాయమూర్తి సత్యనారాయణ నవందర్ నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేశారు.

నిందితులపై మోపిన నేరాలను నిరూపించడంలో ,హత్య వెనుక ఉన్న కుట్ర పూరిత గొలుసుకట్టు పరిణామాలను (Chain of Conspiracy) రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో శనివారం తుది తీర్పు వెలువడింది.

ఈ ఘోర ఉదంతం 2006 జూన్ 3న చోటుచేసుకుంది. ఉస్మానాబాద్ (ప్రస్తుతం ధారాశివ్) జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్, ఆయన డ్రైవర్ సమద్ కాజీతో కలిసి ముంబై నుండి వస్తుండగా నవీ ముంబైలోని కలంబోలి వద్ద కొందరు దుండగులు వారి కారును అడ్డుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడికక్కడే హతమార్చారు. రాజకీయంగా, వ్యాపారపరంగా ఉన్న తీవ్ర వైషమ్యాల కారణంగానే ఈ కాంట్రాక్ట్ హత్య జరిగిందని, పవన్‌రాజేకు బంధువైన పదంసింగ్ పాటిల్ టెర్నా షుగర్ ఫ్యాక్టరీ వివాదాల నేపథ్యంలో దాదాపు 30 లక్షల రూపాయల సుపారీ (కాంట్రాక్ట్ మనీ) ఇచ్చి ఈ హత్య చేయించారని సీబీఐ తన చార్జిషీట్‌లో ఆరోపించింది.

ఈ కేసు విచారణలో భాగంగా 2009లో సీబీఐ అధికారులు పదంసింగ్ పాటిల్‌ను అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో నిందితుడిగా ఉండి ఆ తర్వాత ప్రభుత్వ సాక్షిగా మారిన పరస్మాల్ జైన్ ఇచ్చిన వాంగ్మూలం నమ్మదగినదిగా లేదని, లొంగిపోయిన తర్వాత అతడు పదే పదే తన మాటలను మార్చాడని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. 2011లో అధికారికంగా ప్రారంభమైన ఈ సుదీర్ఘ విచారణ ప్రక్రియలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారేతో సహా మొత్తం 128 మంది సాక్షులను కోర్టు క్షుణ్ణంగా విచారించింది.

తీర్పు వెలువడటానికి ముందు పవన్‌రాజే నింబాల్కర్ కుమారుడు, ప్రస్తుత శివసేన (యూబీటీ) ఎంపీ ఓంరాజే నింబాల్కర్ మాట్లాడుతూ తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, రెండు దశాబ్దాలుగా న్యాయం కోసం తమ కుటుంబం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. అయితే శనివారం కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుతో మహారాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం నడిచిన ఒక హైప్రొఫైల్ రాజకీయ హత్య కేసుకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *