Skip to content
బిజినెస్ వార్తలు

Chandrasekaran Resigns: ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటన.. రూ.68 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..

Prajapaksham 12 Aug 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
Chandrasekaran Resigns: ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటన.. రూ.68 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి..

N Chandrasekaran

దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్.. తన పదవీకాలం ముగిశాక మళ్లీ ఆ బాధ్యతలను స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదని ప్రకటించిన వార్త స్టాక్ మార్కెట్‌ను తీవ్ర షాక్‌కు గురిచేసింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో టాటా గ్రూప్‌నకు చెందిన పలు కీలక కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో గ్రూప్‌లోని 17 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూమ్ ఒక్కరోజే ఏకంగా రూ. 68,119 కోట్లు పడిపోయింది.

ఈ అనూహ్య పరిణామంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమవగా.. గత సెషన్‌లో రూ. 27 లక్షల కోట్లుగా ఉన్న గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ. 26.32 లక్షల కోట్లకు పడిపోయింది. ప్రధానంగా గ్రూప్‌లో అత్యంత విలువైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేరు 4.79 శాతం మేర క్షీణించి రూ. 2,323.30 వద్ద ముగిసింది. ఫలితంగా టీసీఎస్ మార్కెట్ విలువ ఒక్కరోజే రూ. 42,440 కోట్లు ఆవిరైంది.

టీసీఎస్‌తో పాటు ఇతర ప్రముఖ కంపెనీలు కూడా నష్టాలను చవిచూశాయి. టైటాన్ మార్కెట్ విలువ రూ. 9,304 కోట్లు తగ్గగా.. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ రూ. 4,898 కోట్లు, టాటా స్టీల్ రూ. 4,745 కోట్లు నష్టపోయాయి. అలాగే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా ఎలక్సీ, ట్రెంట్ కంపెనీల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

అయితే మార్కెట్ ప్రతికూలతల నడుమ కూడా కొన్ని టాటా కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ రూ. 1,786 కోట్లు పెరగ్గా, టాటా క్యాపిటల్ రూ. 700 కోట్లు, టాటా కెమికల్స్ రూ. 167 కోట్లు, వోల్టాస్ రూ. 66 కోట్లు చొప్పున తమ మార్కెట్ విలువను పెంచుకోగలిగాయి.

2027 ఫిబ్రవరితో తన పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో.. నూతన నాయకత్వ వారసత్వ ప్రణాళికపై బోర్డు స్పష్టమైన నిర్ణయంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని తెలుపుతూ చంద్రశేఖరన్ తప్పుకోవడానికి మొగ్గు చూపారు. ఆయన నిష్క్రమణ వార్తతో ఏర్పడిన అనిశ్చితి కారణముగానే మార్కెట్‌లో ఈ స్థాయిలో నష్టాలు నమోదయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.