ఇరాన్తో శాంతి ఒప్పందానికి బ్రేక్.. స్విస్ చర్చల నుంచి అమెరికా వెనక్కి.. ట్రూస్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు..
US-Iran Peace Talks in Switzerland Called Off, Casting Doubt on Lasting Truce
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు తీవ్ర అనిశ్చితిలో పడ్డాయి. ఇరాన్ ప్రతినిధులతో అమెరికా జరపాల్సిన చర్చలను ప్రస్తుతానికి ముగిస్తున్నట్లు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన దేశ పర్యటన ప్రణాళికలను అకస్మాత్తుగా విరమించుకోవడంతో, ఈ ప్రాంతంలో శాశ్వత కాల్పుల విరమణ కుదురుతుందా లేదా అనే అనుమానాలు బలపడ్డాయి.
దీనివల్ల శుక్రవారం జరగాల్సిన కీలక సమావేశం నిలిచిపోయింది. ఈ చర్చల ఏర్పాట్లు ఎప్పుడూ ఊహించిన విధంగా సాగలేదని, అయితే ప్రణాళికలు ఖరారైన వెంటనే వాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం బయలుదేరడానికి సిద్ధంగా ఉందని వైట్ హౌస్ ప్రతినిధి స్పష్టం చేశారు. బర్గెన్స్టాక్ పర్వత శిఖర విహార కేంద్రంలో జరగాల్సిన ఈ చర్చలు రద్దయిన విషయాన్ని స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించినప్పటికీ.. అందుకు గల పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
గత బుధవారం కుదిరిన 14-సూత్రాల ఒప్పందం ప్రకారం తాత్కాలికంగా ఉన్న కాల్పుల విరమణను కనీసం 60 రోజులు పొడిగించిన తర్వాత, సాంకేతిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే తాజా పరిణామాలపై టెహ్రాన్ నుండి తక్షణ స్పందన ఏదీ రాలేదు. అమెరికా మధ్యంతర ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేస్తోందనే సంకేతాలు వస్తేనే తమ ప్రతినిధులు స్విట్జర్లాండ్ వెళ్తారని ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ తస్నిమ్ అంతకుముందే పేర్కొంది. ఈ ఒప్పందంపై ఉభయ దేశాల అధ్యక్షులు సంతకాలు చేసిన తర్వాత, స్విట్జర్లాండ్లో ప్రత్యేకంగా అధికారిక సంతకాల కార్యక్రమం అవసరం లేదంటూ ఇరాన్ విదేశాంగ శాఖ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘర్షణల్లో కనీసం 7,000 మంది ప్రాణాలు కోల్పోగా, ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి ,ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ దాడులను ప్రారంభించినప్పుడు, ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పొరుగు దేశాలపై దాడులు చేయకుండా నిరోధించడం, ఇజ్రాయెల్ వ్యతిరేక మిలిటెంట్లకు మద్దతు నిలిపివేయడం వంటి లక్ష్యాలను ఆయన నిర్దేశించుకున్నారు.
అయితే, ప్రస్తుతం కుదిరిన ఒప్పందంలో ఆ లక్ష్యాలేవీ పూర్తిగా నెరవేరనట్లు కనిపిస్తోంది. దీనికి బదులుగా ఇరాన్కు ఆర్థిక ఆంక్షల నుండి ఉపశమనం లభించడం, బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదల, చమురు ఎగుమతులకు మినహాయింపులు లభించడం వంటివి జరిగాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్లోని రిపబ్లికన్ మిత్రులు ట్రంప్ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా మొజ్తబా ఖమేనీ స్పందిస్తూ, ట్రంప్ నిస్సహాయతతోనే ఈ ఒప్పందంపై సంతకం చేశారని, అమెరికా మితిమీరిన డిమాండ్లు పెడితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు, ఈ శాంతి చర్చలకు దూరంగా ఉన్న ఇజ్రాయెల్, లెబనాన్లోని ఇరాన్ మిత్రపక్షమైన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై తన పోరాటాన్ని ఉధృతం చేసింది. తాజా ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో కనీసం 15 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఒప్పందం లెబనాన్లో కూడా శాశ్వత ముగింపును కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని, విస్తరించిన కొత్త ఆక్రమణ ప్రాంతాల మ్యాప్ను ప్రదర్శిస్తోంది.
ఇజ్రాయెల్ చర్యలపై ట్రంప్ బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో ఇరు దేశాల మధ్య దశాబ్దాల కాలంలోనే అతిపెద్ద విభేదాలు తలెత్తాయి. ఏదేమైనా, కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో, ప్రపంచ ముడి చమురు సరఫరా పుంజుకుంటుందనే ఆశలతో శుక్రవారం చమురు ధరలు కొంత తగ్గాయి. అయితే అంతర్జాతీయ అగ్రరాజ్యం దాడిని తట్టుకుని, ఆర్థిక ప్రయోజనాలను సాధించిన ఇరాన్, ఈ ప్రాంతంలో మునుపటి కంటే మరింత బలమైన స్థితిలో నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.