Skip to content
ప్రపంచం వార్తలు

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్ జెబెల్ అలీలో వరుస పేలుళ్లు.. యెమెన్ క్షిపణి దాడి అనుమానాలు!

Prajapaksham 05 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్ జెబెల్ అలీలో వరుస పేలుళ్లు.. యెమెన్ క్షిపణి దాడి అనుమానాలు!

Massive Explosions Rock Dubai

యూఏఈలోని దుబాయ్ నగరం జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించడం తీవ్ర కలకలం రేపింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఏడు భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్‌కు చెందిన మెహర్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదం కారణంగా పారిశ్రామిక ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి.

సరకు రవాణా, భారీ ఇంధన నిల్వలకు అత్యంత కీలక కేంద్రమైన జెబెల్ అలీ నౌకాశ్రయం (Port) సమీపంలోని ఒక గిడ్డంగిలో నాసా (NASA) థర్మల్ ఇమేజరీ ప్రకారం భారీ అగ్నిప్రమాదం నమోదైంది. నిల్వ ఉంచిన ఇంధన పదార్థాల వల్లనే పేలుళ్ల తీవ్రత పెరిగి మంటలు వేగంగా వ్యాపించినట్లు భావిస్తున్నారు.

ఈ ప్రమాదానికి యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణులే కారణమని ఇరాన్ మీడియా పేర్కొనగా, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని కొన్ని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అదే సమయంలో యెమెన్ రాజధాని సనాలో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై హౌతీ గ్రూప్ గానీ, యూఏఈ ప్రభుత్వం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సంఘటనా స్థలంలో చోటుచేసుకున్న పేలుళ్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వాటిని చిత్రీకరించిన ఇద్దరిని యూఏఈ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇరాన్ వ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సంభవించిన ఈ ఘటనపై యూఏఈ భద్రతా దళాలు దర్యాప్తును వేగవంతం చేశాయి.