Skip to content
ప్రపంచం వార్తలు

ఇరాన్‌తో స్వతంత్ర సంబంధాలపై గల్ఫ్‌ దేశాల దృష్టి

Prajapaksham 05 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
ఇరాన్‌తో స్వతంత్ర సంబంధాలపై గల్ఫ్‌ దేశాల దృష్టి

Iran Rejects Oman Proposal: హోర్ముజ్‌లో ఒమన్‌కు సమానాధికారం ఇవ్వం.. 50-50 భాగస్వామ్యానికి ఇరాన్ నో

రచయిత: నంటూ బెనర్జీ

ఆరు దేశాల గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ)తో అమెరికా భాగస్వామ్యాన్ని కాపాడటానికి, యుద్ధం కారణంగా అవుతున్న భారీ ఆర్థిక వ్యయం నుంచి తప్పించుకునేందుకు, ప్రస్తుత పరిస్థితి నుంచి కనీసం త్వరితగతిన గౌరవప్రదమైన నిష్క్రమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్‌ యుద్ధ వ్యయం పెంటగాన్‌ ప్రత్యక్ష ఖర్చుల రూపంలో ఇప్పటికే సుమారు 37.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అయితే, విస్తృత ఆర్థిక ప్రభావ అంచనాలు దీనికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఈ యుద్ధం జీసీసీ సభ్య దేశాలైన బహ్రెయిన్‌, కువైట్‌, ఒమాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దేశాలకు అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ, అవి తమ వద్ద భారీ అమెరికా సైనిక స్థావరాలను కలిగి ఉన్నందున సహజంగానే యుద్ధ బాధితులుగా మారాయి. జీసీసీ సభ్య దేశాలు తమ పౌర, ఇంధన, లాజిస్టిక్స్‌ మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ జరుపుతున్న విస్తృతమైన ప్రతీకార దాడులను ఎదుర్కొంటున్నాయి.

తటస్థత పేరుతో ఇరుపక్షాల మధ్య పోరాటానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ, భౌగోళిక, వ్యూహాత్మక వాస్తవాలు ఈ దేశాలను ఈ యుద్ధంలో లోతుగా బంధించాయి. కొనసాగుతున్న అమెరికా-ఇరాన్‌ సంఘర్షణలో గల్ఫ్‌ సహకార మండలి సభ్య దేశాలు ప్రత్యక్ష ప్రతీకార క్షిపణి దాడులు, ప్రధాన ఇంధన మౌలిక సదుపాయాల నష్టం, కీలక వాణిజ్య మార్గాల మూసివేత వంటి వాటితో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

భారీ వ్యయంతో కూడిన అమెరికా రక్షణపై గల్ఫ్‌ దేశాలు విశ్వాసం కోల్పోతున్నాయి. ఈ దేశాలు అమెరికా సైనిక రక్షణ కోసం నేరుగా ఎలాంటి స్థిర మొత్తాన్ని చెల్లించనప్పటికీ, సంప్రదాయబద్ధంగా అమెరికా స్థావరాలకు ఆతిథ్యం ఇవ్వడం, బిలియన్‌ల కొలది అమెరికన్‌ సైనిక పరికరాలను కొనుగోలు చేయడం, అమెరికా మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో తమ వంతు సహకారం అందిస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి జీసీసీ సభ్య దేశాలు అధునాతన అమెరికా రక్షణ వ్యవస్థలు, విమానాలు, క్షిపణులను కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటాయి. తమ భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాల కోసం అవి భూమి, లాజిస్టిక్స్‌, వివిధ స్థాయిలలో ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

అమెరికా సైనిక ఆస్తులు, సిబ్బందికి ఆతిథ్యం ఇస్తున్నందున, ఇరాన్‌ ఆ ఆరు జీసీసీ సభ్య దేశాలను లక్ష్యంగా చేసుకుని గత మార్చి నుంచి వేలాది క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. ఇరాన్‌ క్షిపణులు కువైట్‌, బహ్రెయిన్‌లలోని విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలు, కీలకమైన నీటి నిర్లవణీకరణ, విద్యుత్‌ ప్లాంట్లతో సహా సైనికేతర, పౌర మౌలిక సదుపాయాలపై గురిపెట్టి దాడి చేశాయి. ఇరాన్‌ నుంచి ఎదురవుతున్న సైనిక ముప్పులను అడ్డుకునేందుకు గల్ఫ్‌ అంతటా ఉన్న వాయు రక్షణ వ్యవస్థలు నిరంతరంగా, అధిక వ్యయంతో కూడిన క్రియాశీలతలోకి రావాల్సి వచ్చింది.

హోర్ముజ్‌ జలసంధి వాస్తవంగా మూసివేయడం, ఖతార్‌లోని రాస్‌ లఫాన్‌ పారిశ్రామిక కేంద్రం వంటి సౌకర్యాలపై జరిగిన ప్రత్యక్ష దాడుల కారణంగా ప్రధాన చమురు, లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతులు నిలిచిపోయాయి లేదా భారీగా తగ్గిపోయాయి. అదే సమయంలో దుబాయ్‌, అబుదాబి, దోహాల్లో పర్యాటకం, విమానయానం, ప్రధాన రవాణా కేంద్రాలు భారీగా పెట్టుబడులు తరలిపోవడంతో, సుదీర్ఘకాలం పాటు గగనతల మూసివేతలు, విమాన ప్రయాణాల రద్దు వంటి వాటితో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అయినప్పటికీ, బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందాలు, అస్థిరమైన నౌకా మార్గాలు, స్తంభించిపోయిన దౌత్యపరమైన చట్రాలు ప్రస్తుత ప్రతిష్ఠంభనను నిర్వచిస్తున్నందున, ఇరాన్‌తో సంఘర్షణ నుంచి అమెరికా గౌరవప్రదంగా వైదొలగడం అంతుచిక్కని సమస్యగానే ఉంది. అంతకుముందు, అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా కొన్ని రోజుల పాటు వైమానిక దాడులను నిలిపివేయగా, టెహ్రాన్‌ కూడా అదే విధంగా తన ప్రతీకార చర్యలను నిలిపివేసింది. అయితే, ఉద్రిక్తత మరోసారి ముదురుతున్నట్లు కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు తరచుగా ఇరాన్‌ అధికారులతో అమెరికా ‘అత్యంత స్నేహపూర్వక’, ‘సరైన’ చర్చలు జరుపుతోందని చెబుతుండగా, టెహ్రాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని బహిరంగంగా ఖండిస్తోంది. వాస్తవానికి, అమెరికా బలగాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు ప్రయత్నించినందుకు ప్రతీకారంగా, ఇరాన్‌పై ‘భారీ దాడుల పరంపర’ను పూర్తి చేసినట్లు గత వారం అమెరికా ప్రకటించింది.

అమెరికా తాజా దాడుల్లో ఖేష్మి ఐలాండ్‌లో రెండేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మరణించినట్లు ఇరాన్‌ ధృవీకరించింది. అదే సమయంలో దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని ఇతర ప్రదేశాలపై కూడా దాడులు జరిగాయి. అమెరికా-సౌదీ సంయుక్త దాడులు ఇరాక్‌లోని ఇరాన్‌ మద్దతుదారుల (ప్రాక్సీ)ను లక్ష్యంగా చేసుకున్నాయి. యుద్ధ తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో జూన్‌లో ఒక స్వల్పకాలిక అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, ఇరాన్‌ తన నియంత్రణను కొనసాగిస్తుండటంతో, కీలకమైన జలమార్గం హోర్ముజ్‌ జలసంధి ఒక ప్రధాన ఉద్రిక్త ప్రాంతంగా కొనసాగుతోంది. సమగ్రమైన, శాశ్వతమైన ఒప్పందం కుదరకపోతే దాడులు తక్షణమే పునఃప్రారంభమవుతాయని అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఈలోగా, సౌదీ అరేబియా, హౌతీ దళాలతో సహా ప్రాంతీయ ప్రాక్సీల మధ్య ఘర్షణలు అస్థిర భౌగోళిక పరిధిని విస్తరిస్తూనే ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన ప్రధాన, సుదీర్ఘ సైనిక సంఘర్షణలను విజయంతో ముగించడం అరుదుగానే సంభవించిందని గమనించాలి. దాని సుదీర్ఘ సైనిక సంఘర్షణలలో చాలా వరకు ప్రతిష్ఠంభనలతో, అగౌరవకరమైన నిష్క్రమణలతో ముగిశాయి. వాటిలో 1950 కొరియా యుద్ధం, 1955 వియత్నాం యుద్ధం, 2001 ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధం, 2003 ఇరాక్‌ యుద్ధం ఉన్నాయి.

కొరియా యుద్ధం సంపూర్ణ విజయంతో కాకుండా కాల్పుల విరమణతో ముగిసింది. ఫలితంగా కొరియా ద్వీపకల్పం 38వ సమాంతర రేఖ వద్ద విభజించబడింది. వియత్నాం యుద్ధం సైనిక ఉపసంహరణతో, దక్షిణ వియత్నాం ఉత్తర వియత్నాం వశమవ్వడంతో ముగిసింది. ఆఫ్ఘన్‌ యుద్ధం తాలిబాన్‌ను అధికారం నుంచి తొలగించాలనే ప్రాథమిక లక్ష్యాన్ని సాధించినప్పటికీ, 20 ఏళ్ల ఆక్రమణ తర్వాత తాలిబాన్‌ పూర్తిస్థాయి పునరుజ్జీవంతో అది ముగిసింది. ఇరాక్‌ యుద్ధం సద్దాం హుస్సేన్‌ను విజయవంతంగా పదవీచ్యుతుడిని చేసింది. కానీ, ఆ దేశంలో సుదీర్ఘమైన తిరుగుబాటు, ప్రాంతీయ అస్థిరతకు దారితీసింది.

ఇరాన్‌ యుద్ధం నుంచి అమెరికా వైదొలగినట్లయితే, గల్ఫ్‌ దేశాలపై అమెరికా సైనిక, వ్యూహాత్మక పట్టును గణనీయంగా కోల్పోవచ్చు. గల్ఫ్‌ దేశాలపై అమెరికా భద్రతా చట్రం విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధునాతన అమెరికన్‌ వాయు రక్షణ వ్యవస్థలు దూసుకొస్తున్న అత్యధిక క్షిపణులను అడ్డుకున్నప్పటికీ, ఈ సంఘర్షణ లోతైన బలహీనతలను బయటపెట్టింది. ఎందుకంటే, ఆతిథ్య దేశాలు ప్రాంతీయ ప్రతీకార దాడుల కారణంగా భారీ భౌతిక నష్టం, మౌలిక సదుపాయాల అంతరాయాలు, ఆర్థిక నష్టాలను చవిచూశాయి. అమెరికా-ఇరాన్‌ యుద్ధం తీవ్రతరం అవుతున్న కొద్దీ, అమెరికా సైనిక స్థావరాలకు ఆతిథ్యం ఇస్తున్నందున గల్ఫ్‌ దేశాలు ఇరాన్‌ నుంచి భారీ డ్రోన్‌, క్షిపణి దాడులకు అత్యంత సులభంగా గురవుతాయని స్పష్టమైంది. వాటిని రక్షించడంలో అమెరికా విఫలమైంది.

గల్ఫ్‌ దేశాలు ఇప్పుడు కేవలం వాషింగ్టన్‌-కేంద్రీకృత భద్రతా వైఖరిపై ఆధారపడటానికి బదులుగా, చైనా, భారతదేశం, పాకిస్తాన్‌, ఐరోపా దేశాల వంటి ప్రత్యామ్నాయ ప్రపంచ, ప్రాంతీయ భాగస్వాములతో స్వతంత్ర భద్రతా సంబంధాలను, బహుళపక్ష భాగస్వామ్యాలను నిర్మించుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ దేశాలు వాషింగ్టన్‌ నుంచి పూర్తిగా వైదొలగాలని ప్రణాళిక వేయనప్పటికీ, ప్రాంతీయ సంఘర్షణల సమయంలో అమెరికా భద్రతా చట్రం తమ సొంత భూభాగాలను లక్ష్యాలుగా మార్చినందున, తమ దీర్ఘకాలిక భద్రతా వ్యూహాన్ని చురుకుగా పునరాలోచిస్తూ ఇరాన్‌తో స్వతంత్ర దౌత్యంలో నిమగ్నమవుతున్నాయి. స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఇరాన్‌తో నేరుగా ఒక స్థానిక, ప్రాంతీయ భద్రతా, ఆర్థిక చట్రాన్ని నిర్మించే ప్రయత్నాలకు ఖతార్‌ నేతృత్వం వహిస్తోంది.

ట్యాగ్‌లు: World News