శాంతి ఒప్పదం కుదరకపోతే ఇరాన్పై బాంబులు వేస్తా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump Warns of Bombing if Iran Peace Deal Fails
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 19న అమెరికా-ఇరాన్ల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరబోతోంది. అయితే, ఈ ఒప్పందానికి సరిగ్గా రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని ఆయన తేల్చి చెప్పారు.
వంద రోజుల యుద్ధానికి తెర:
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. నాటి నుంచి వంద రోజులకు పైగా ఈ భీకర యుద్ధం సాగింది. ఇరువైపులా భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో.. ఎట్టకేలకు జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు ఒక అవగాహన ఒప్పందానికి (MoU) రానున్నారు. ఈ రెండు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి పాకిస్థాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ కీలక పాత్ర పోషించాయి.
ట్రంప్ షరతులు.. లేదంటే బాంబులే!
ఒప్పందానికి సమయం దగ్గరపడుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో కఠిన వ్యాఖ్యలు చేశారు. “ఈ ఒప్పందానికి అణు ఆయుధాల నిర్మూలనే ప్రాతిపదిక. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు. ఇరాన్ తన అణు ప్రోగ్రామ్ను తక్షణమే నిలిపివేయాలి, అలాగే తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించాలి” అని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ షరతులకు ఒప్పుకుంటూ ఇరాన్ సంతకం చేయాలని, లేనిపక్షంలో సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఒకవేళ ఒప్పందం విజయవంతమైతే, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ తిరిగి అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ స్పందన ఏంటి?
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దౌత్యపరంగా స్పందించారు. “జూన్ 19న జరగబోయే అవగాహన ఒప్పందం (MoU) అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. అణు ప్రోగ్రామ్కు సంబంధించిన భవిష్యత్తు వ్యూహాలపై చర్చలు మరింత కాలం కొనసాగుతాయి” అని ఆయన పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే యుద్ధం పూర్తిగా నిలిచిపోతుందని, హర్మూజ్ జలసంధిలో రవాణా కార్యకలాపాలు యథావిధిగా ఇరాన్-ఒమాన్ దేశాల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా దీనిపై సానుకూల ప్రకటన చేసింది. ఒప్పందం జరిగిన వెంటనే లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో యుద్ధం తక్షణమే ఆగిపోతుందని, నావికాదళంపై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయని వెల్లడించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
ప్రపంచ చమురు రవాణాలో ‘హర్మూజ్ జలసంధి’ అత్యంత వ్యూహాత్మకమైనది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి కుదిరితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, గత వంద రోజులుగా జరిగిన యుద్ధంలో ఇరు దేశాల్లోని గ్యాస్, ఆయిల్ ఫీల్డ్స్ భారీగా ధ్వంసమయ్యాయని, వాటిని తిరిగి పునరుద్ధరించి పూర్వ స్థితికి తీసుకురావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.