జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. భారీగా మోహరించిన ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు
Delhi Police, Paramilitary Forces Deployed for Cockroach Janta Party Protest at Jantar Mantar
పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) శనివారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ (CBSE) మార్కింగ్ విధానంలో అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికా నుంచి నేరుగా జంతర్ మంతర్కు చేరుకుని నిరసనకు స్వయంగా నాయకత్వం వహించడంతో ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేశ రాజధానిలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI), ప్రధాన రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, ఢిల్లీ సరిహద్దు ప్రవేశ మార్గాల వద్ద పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులకు అదనంగా దాదాపు 40 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. వివిధ జిల్లాలకు చెందిన జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు (DCPs), అదనపు డీసీపీలు, ఏసీపీలతో కూడిన సీనియర్ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
సెంట్రల్ ఢిల్లీతో పాటు నగరంలోని ఇతర వ్యూహాత్మక ప్రాంతాలకు దారితీసే రహదారులపై పలు దఫాలుగా బారికేడ్లను ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వెలుపల కూడా అదనపు బలగాలను మోహరించారు. నిరసన ముసుగులో ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రయత్నాలను అడ్డుకోవడానికి స్పెషల్ బ్రాంచ్ అన్ని జిల్లాల పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. అలాగే జంతర్ మంతర్ పరిసరాల్లో క్యాబ్ల బుకింగ్లలో ఏదైనా అసాధారణ పెరుగుదల ఉందేమో గమనించడానికి పోలీసులు ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.
నిరసనకారులు శాంతియుత వాతావరణంలో, క్రమశిక్షణతో ఆందోళన సాగించాలని సీజేపీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ నిరసనకు వచ్చే ప్రతి ఒక్కరూ తమతో పాటు జాతీయ జెండాను, ఒక పుస్తకాన్ని తీసుకురావాలని కోరింది. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి కృతజ్ఞతగా పూలను అందించాలని, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ నిరసనల కారణంగా నగరంలో మెట్రో సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, ప్రయాణికుల రాకపోకలు సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
గత నెల (మే 15) ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నకిలీ డిగ్రీలతో ఉపాధి లేక వ్యవస్థపై దాడి చేసే కొంతమంది యువతను ఉద్దేశించి “బొద్దింకలు” (కాక్రోచెస్) సమాజానికి పరాన్నజీవులు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ వ్యాఖ్యలకు వ్యంగ్యాస్త్రంగా ఆన్లైన్ వేదికగా పుట్టుకొచ్చిన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’, అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది ఫాలోవర్లతో దేశవ్యాప్త డిజిటల్ ఉద్యమంగా మారి, నేడు విద్యా వ్యవస్థలోని లోపాలపై ప్రత్యక్ష పోరాటానికి దిగింది.