Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Weather Update: తెలంగాణ వెదర్ అప్‌డేట్.. కరుణించని వరుడు.. అంతంతమాత్రంగానే వానలు.. లోటు వర్షపాతం మరింత పెరిగే ప్రమాదంపై ఆందోళన..

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Weather Update: తెలంగాణ వెదర్ అప్‌డేట్.. కరుణించని వరుడు.. అంతంతమాత్రంగానే వానలు.. లోటు వర్షపాతం మరింత పెరిగే ప్రమాదంపై ఆందోళన..

Telangana Weather Update: తెలంగాణ వెదర్ అప్‌డేట్.. కరుణించని వరుడు.. అంతంతమాత్రంగానే వానలు.. లోటు వర్షపాతం మరింత పెరిగే ప్రమాదంపై ఆందోళన..

Telangana Weather Update: నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురవాల్సిన వర్షాలు ఈసారి పూర్తిగా ముఖం చాటేశాయి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వర్షాభావ పరిస్థితులే రాజ్యమేలుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో విపరీతంగా పెరిగిన ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడకపోవడంతో.. రాష్ట్రంలో రోజురోజుకూ లోటు వర్షపాతం భయానకంగా పెరుగుతోంది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు కాస్త మందకొడిగా ప్రారంభమైనప్పటికీ.. జూలై రెండో వారం నాటికి రుతుపవనాలు చురుకుగా మారి విస్తారంగా వానలు కురుస్తుంటాయి. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎంబీ) మొదట్లో సాధారణ వర్షపాతం ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ జూన్, జూలై రెండు నెలల్లోనూ వర్షాలు గణనీయంగా తగ్గిపోయాయి.

గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో ఎంతటి తీవ్రమైన మార్పు వచ్చిందో స్పష్టమవుతోంది. ఎల్‌నినో ప్రభావం మే నెల నుంచే ప్రారంభమవడంతో ఆ నెలలో ఒక్కరోజు కూడా చినుకు కురవలేదు. జూన్ నెలలోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్ మాసంలో సాధారణంగా కురవాల్సిన 13.03 సెంటీమీటర్ల వర్షపాతానికి గాను కేవలం 11.53 సెంటీమీటర్లు మాత్రమే నమోదై 12 శాతం లోటును చూపించింది.

ఇక జూలై నెల విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జూలై 20 నాటికి 14.01 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 7.16 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే ఈ ఒక్క నెలలోనే ఏకంగా 49 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నైరుతి సీజన్ మొత్తంలో ఇప్పటివరకు సగటున 27.04 సెంటీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా.. కేవలం 18.69 సెంటీమీటర్లు మాత్రమే నమోదవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సగటున 31 శాతం లోటు ఏర్పడిందని రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పష్టం చేసింది.

వర్షాలు పడకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. జూలై ఆఖరు దాటుతున్నా చెరువులు, ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పెరగకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనలో పడేసింది. ప్రధాన పంటలైన వరి నాట్లు వేయడానికి నీరు లేక, పత్తి, మొక్కజొన్న వంటి పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విత్తనాలు వేసిన రైతులు వర్షం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేక కొన్ని చోట్ల వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయి మాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ముందస్తు జాగ్రత్తగా వర్షాలు పడేవరకు సాగు పనులను పూర్తిగా వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుతం ఆకాశంలో అక్కడక్కడా మబ్బులు పట్టి వాతావరణం చల్లబడినప్పటికీ వర్షం మాత్రం పడటం లేదు. దానికి ప్రధాన కారణం ఎల్‌నినో ప్రభావంతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో బలమైన అల్పపీడన వ్యవస్థలు ఏర్పడకపోవడమేనని చెప్పవచ్చు. పైగా దిగువ ట్రోపోస్ఫియర్ వాతావరణంలో వేగంగా వీస్తున్న బలమైన ఉపరితల గాలుల వల్ల ఏర్పడిన మేఘాల్లో తేమ నిలవడం లేదు. దట్టమైన వర్షపు మేఘాలు కమ్ముకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ గాలుల ధాటికి చెదిరిపోతున్నాయి. ఫలితంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే వాతావరణం దెబ్బతింటోంది.

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాష్ట్రంలో వర్షాభావం తొలగి పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం గానీ లేదా ఉపరితల ఆవర్తనం గానీ ఏర్పడి రాష్ట్రం వైపు కదలాల్సి ఉంది. అలాంటి బలమైన వాతావరణ వ్యవస్థలు ఏర్పడే వరకు నైరుతి రుతుపవనాలు పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారాంతం వరకు కూడా వాతావరణంలో పెద్దగా మార్పులు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో లోటు వర్షపాతం మరింత పెరిగే ప్రమాదం ఉందనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.