మీ పదేళ్ల పాలన.. మా రెండున్నరేళ్ల పాలనపై సభలో చర్చిద్దామా.. కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్..
Telangana CM Revanth Reddy Predicts Another Defeat for BRS in 2029
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కమీషన్ల పేరిట ప్రజలను మోసం చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండున్నరేళ్లలోనే విద్యార్థులు, రైతులు, మహిళల సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో పాటు పాలమూరు జిల్లా అభివృద్ధిపై తనకున్న సంకల్పాన్ని చాటిచెప్పారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చిందో అక్కడే ఓట్లు అడగాలని, తాము కట్టించిన ఇందిరమ్మ ఇళ్ల వద్ద తాము ఓట్లు అడుగుతామని రేవంత్రెడ్డి సవాల్ చేశారు. ప్రాజెక్టులు, ఇళ్లు ఇస్తామని చెప్పి పదేళ్లు మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు తాము చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో అభివృద్ధిని అడ్డుకుంటే భవిష్యత్తులో ఆ పార్టీ జెండా ఎగరనీయమని, 2029 ఎన్నికల్లోనూ ఓడించి కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తెస్తామని హెచ్చరించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన వర్సెస్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. ఈ చర్చలో తాను ఓడిపోతే అక్కడికక్కడే క్షమాపణ చెబుతానని, లేదంటే కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితం కావాలని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఒక్క రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ ఇవ్వలేదని విమర్శించిన సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సాధించిన విజయాలను అంకెల్తో వివరించారు. ఇప్పటివరకు 15 లక్షల రేషన్ కార్డులు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.10వేల కోట్లు కేటాయించామని, 1,000 బస్సులకు మహిళలను యజమానులను చేశామని తెలిపారు. వీటితో పాటు 67,616 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, రూ.20,616 కోట్ల రుణమాఫీతో పాటు రూ.27వేల కోట్ల రైతుభరోసా నిధులను అందించామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్లో ఓడిపోతాననే భయంతో కేసీఆర్ 2009లో పాలమూరుకు వలస వచ్చారని రేవంత్రెడ్డి గుర్తుచేశారు. ఇక్కడి వలసలు, రైతుల ఆత్మహత్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తారనే నమ్మకంతో జిల్లా ప్రజలు ఆయనను గెలిపిస్తే, ఐదేళ్ల కాలంలో కనీసం ఐదుసార్లు కూడా జిల్లాకు రాలేదని ఆరోపించారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చట్టం తెచ్చి తెలంగాణ ఇస్తే.. ప్రజలు కేసీఆర్ను రెండుసార్లు సీఎంను చేశారన్నారు.
అయినా పదేళ్లలో పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఉదండాపూర్ ముంపు బాధితులకు రూ.800 కోట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల సాధన గురించి హరీశ్రావు రాసిన లేఖలపై స్పందిస్తూ, వారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని, వారి వద్ద తాము నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్తో మాట్లాడి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీటిని ఒప్పించే పూర్తి బాధ్యత తనదేనని, గ్రీన్ఛానల్ ద్వారా నిధులిచ్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
తాను 20 ఏళ్ల క్రితం జడ్చర్ల నుంచే జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని, ఇక్కడి ప్రజలు పెంచిన మొక్కే ఈరోజు ముఖ్యమంత్రిగా వృక్షమై నిలిచిందని రేవంత్రెడ్డి భావోద్వేగంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం రూ.20వేల కోట్లు ఖర్చు పెడితే, అందులో రూ.8వేల కోట్లు ఒక్క పాలమూరు జిల్లాకే కేటాయించానని తెలిపారు. గత ప్రభుత్వం జైళ్లు కట్టాలని చూస్తే, తాము పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్’ నిర్మిస్తున్నామని చెప్పారు.
వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి, 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంచుతామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సహా పలువురు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.