మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్..8 మంది మృతి
Maharashtra Tragedy: 8 Killed After Pilgrim Vehicle Falls Into Well in Solapur
మహారాష్ట్రలో దైవదర్శనం ముగించుకుని వస్తుండగా జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీల్లో ఆదివారం నాడు జరిగిన ఒక ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. రంజినీ గ్రామానికి చెందిన 15 మంది భక్తులు సిద్ధనాథ్ ఆలయంలో దైవ దర్శనం ముగించుకుని, పికప్ వాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తాండుల్వాడి గ్రామం సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ అదుపు కోల్పోవడంతో, ఆ వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. బావిలో నీరు నిండి ఉండటంతో వాహనం మునిగిపోయి, నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
సోలాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ అతుల్ కులకర్ణి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అధికారుల సమయానుకూల స్పందన వల్ల బావిలో మునిగిపోతున్న మరో ఏడుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మృతదేహాలను వెలికితీసే ప్రక్రియతో పాటు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ఘోరం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.కాగా, ప్రమాదం జరిగిన సదరు వ్యవసాయ బావికి ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడం వల్లే వాహనం నేరుగా లోపలికి దూసుకెళ్లి ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.