Skip to content
భారతదేశం వార్తలు

ఐఎండీ చల్లని కబురు.. కేరళ, తమిళనాడును తాకిన నైరుతి రుతుపవనాలు..

Prajapaksham 04 Jun 2026 1 నిమిషాల పఠనం భారతదేశం
ఐఎండీ చల్లని కబురు.. కేరళ, తమిళనాడును తాకిన నైరుతి రుతుపవనాలు..

Southwest Monsoon Makes Entry into Kerala, Advances Across Tamil Nadu

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) అధికారికంగా ధృవీకరించింది. సాధారణంగా జూన్ 1వ తేదీనే ప్రారంభం కావాల్సిన ఈ రుతుపవనాలు, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. అంతకుముందు మే 26నే ఇవి వస్తాయని అంచనా వేసినప్పటికీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వాతావరణ శాఖ అంచనా కంటే నాలుగు రోజులు వెనుకబడ్డాయి.

అయితే, గత రాత్రి నుండి కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షాల తీవ్రతను బట్టి అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు ఐఎండి మూడు గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటు (ఎల్‌పిఎ)లో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న సమయాల్లో వర్షం పడే అవకాశం ఉండటం, ఉరుములతో కూడిన తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో వాతావరణ కార్యాలయం ఢిల్లీకి పసుపు (ఎల్లో) హెచ్చరికను జారీ చేసింది.

ఇలాంటి వాతావరణ మార్పుల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో సంభవించే అవకాశం ఉన్న ‘ఎల్ నినో’ ప్రక్రియ వల్ల పంటల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల మార్కెట్‌లో పప్పుధాన్యాల కొరత లేదా ధరల పెరుగుదల వంటి సరఫరా అంతరాయాలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఒక బలమైన వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం వద్ద ఉన్న 43 లక్షల టన్నుల రికార్డు స్థాయి పప్పుధాన్యాల నిల్వలు ఒక రక్షణ కవచంగా , వ్యూహాత్మక ఆసరాగా పనిచేస్తాయని ఒక ఉన్నత ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

ఫిక్కీ (FICCI) నిర్వహించిన ఒక కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. ఈ నిల్వలను ఇప్పుడే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండి, అది ఖరీఫ్ సాగుపై దెబ్బకొడితే, మార్కెట్‌లో ధరలను నియంత్రించడానికి , సరఫరాలో అంతరాయం కలగకుండా చూసుకోవడానికి ఈ బఫర్ స్టాక్‌ను ఉపయోగిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న 43 లక్షల టన్నుల పప్పుధాన్యాల నిల్వలు గతం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మే 2024లో నమోదైన 21 లక్షల టన్నుల కంటే ఇవి గణనీయంగా అధికం కాగా, మే 2025లో ఉన్న 18 లక్షల టన్నుల నిల్వలతో పోలిస్తే ఇవి ఏకంగా రెట్టింపు కంటే పైగా పెరగడం విశేషం. ఈ ముందస్తు చర్యలు దేశ ఆహార భద్రతకు ఎంతగానో దోహదపడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *