Delhi PG collapse: నియంత్రణ కోల్పోయిన ‘పిజి’ సంస్కృతి
భవన సామర్థ్యం ఎంత? అత్యవసర మార్గాలు ఉన్నాయా? అగ్నిమాపక భద్రత ఉందా? నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా? విద్యుత్ వ్యవస్థ సురక్షితమా? మరమ్మతులు ఎవరు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే విద్యార్థులు అక్కడ నివసిస్తున్నారు.
Delhi PG collapse: ఏడుగురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఢిల్లీలోని సత్యనికేతన్ భవన ప్రమాదం ఒక విషాద ఘటనగా ముగిసిపోవడానికి వీల్లేదు. ఇది ఢిల్లీలోని ఒక భవనం కూలిన ఘటన మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా విద్య కోసం నగరాలకు వచ్చే వేలాదిమంది విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సంక్షోభానికి, నియంత్రణ లేని పేయింగ్ గెస్ట్ (పిజి) వ్యవస్థకు, భద్రతా ప్రమాణాల అమలులో ఉన్న లోపాలకు ఇది అద్దం పడుతోంది.
ఒక విద్యార్థి ఢిల్లీ లేదా హైదరాబాద్కు, బెంగళూరు లేదా పుణేకు, చెన్నైకి లేదా మరే విద్యా కేంద్రానికైనా వస్తున్నప్పుడు అతని ప్రధాన లక్ష్యం చదువు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం పెద్ద నగరాలను ఆశ్రయిస్తారు. వారికి వసతి అనేది సౌకర్యం కాదు, విద్యలో భాగం. మంచి కళాశాల దొరికినా సురక్షితమైన హాస్టల్ దొరకకపోతే వారి విద్యా ప్రయాణం అసంపూర్ణంగానే ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు పిజిలు, హాస్టళ్లు, అద్దె గదులు విస్తరించాయి. డిమాండ్ పెరిగిన కొద్దీ భవనాల వాణిజ్య వినియోగం పెరిగింది. నివాస భవనాలు పిజిలుగా మారాయి. ఒక కుటుంబం కోసం నిర్మించిన భవనాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులను ఉంచుతున్నారు.
భవన సామర్థ్యం ఎంత? అత్యవసర మార్గాలు ఉన్నాయా? అగ్నిమాపక భద్రత ఉందా? నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా? విద్యుత్ వ్యవస్థ సురక్షితమా? మరమ్మతులు ఎవరు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండానే విద్యార్థులు అక్కడ నివసిస్తున్నారు.
సత్యనికేతన్లో ఐదు అంతస్తుల బాలుర పిజి భవనం కూలి ఏడుగురు విద్యార్థులు మరణించడం ఈ వ్యవస్థలోని తీవ్రమైన లోపాలను ముందుకు తెచ్చింది. 27 గంటలకు పైగా సాగిన సహాయక చర్యలు అప్పటికే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయాయి. భవన యజమాని కుటుంబ సభ్యుల అరెస్టులు, మున్సిపల్ అధికారులపై చర్యలు వంటి పరిణామాలు జరిగాయి. కానీ ఇవి ప్రమాదం తర్వాత జరిగే చర్యలు మాత్రమే.
అసలు ప్రశ్న ప్రమాదానికి ముందు వ్యవస్థ ఎక్కడ ఉంది? ఒక భవనంపై అక్రమ నిర్మాణం లేదా భద్రతా ఉల్లంఘన ఉందని గుర్తించడం పరిపాలనా వ్యవస్థకు అసాధ్యమైన పనికాదు. తనిఖీ చేయాలి. ఉల్లంఘన కనిపిస్తే నోటీసు ఇవ్వాలి. అవసరమైతే నిర్మాణాన్ని నిలిపివేయాలి. ప్రమాదకరమైన భవనాన్ని ఖాళీ చేయించాలి. నిబంధనలు ఉల్లంఘించిన యజమానిపై చర్య తీసుకోవాలి.
ఈ ప్రక్రియల్లో ఏ ఒక్క దశ పనిచేయకపోయినా చివరికి దాని మూల్యం విద్యార్థుల ప్రాణాలే కావడం అత్యంత విషాదకరం. సత్యనికేతన్ ఘటన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) లేవనెత్తిన డిమాండ్లలో దేశవ్యాప్తంగా విద్యార్థుల వసతి భవనాలకు ఇంజినీరింగ్ స్థాయి నిర్మాణ భద్రతా ఆడిట్ నిర్వహించాలన్న అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీనిని ఒక రాజకీయ సంస్థ డిమాండ్గా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల వసతికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక సమగ్ర భద్రతా విధానం అవసరమన్న వాస్తవాన్ని అది ముందుకు తెస్తోంది.
దేశంలోని ప్రముఖ విద్యా కేంద్రాల్లో ఇలాంటి ఆడిట్ ఒకసారి చేసి ఫైల్ మూసివేయడం సరిపోదు. భవనం నిర్మాణ స్థిరత్వం, అగ్నిమాపక భద్రత, విద్యుత్ భద్రత, అత్యవసర నిష్క్రమణలు, అధిక జనసాంద్రత, అనుమతించిన వినియోగం, నిర్మాణ మార్పులు వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. తనిఖీల ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
విద్యార్థులు తాము నివసించబోయే పిజి చట్టబద్ధమైనదో కాదో తెలుసుకునే అవకాశం కూడా ఉండాలి. ఒక ప్రభుత్వ పోర్టల్లో పిజి లేదా విద్యార్థి వసతి గృహం పేరు నమోదు చేసి, దానికి భవన అనుమతి ఉందా, అగ్నిమాపక ధ్రువీకరణ ఉందా, తాజా భద్రతా తనిఖీ ఎప్పుడు జరిగింది, ఎలాంటి ఉల్లంఘనలు నమోదయ్యాయి వంటి వివరాలు తెలుసుకునే వ్యవస్థ అవసరం.
ప్రస్తుతం విద్యార్థి వసతి కోసం ఇంటర్నెట్ ప్రకటనలు, బ్రోకర్లు, స్నేహితుల సమాచారం, యజమాని మాటలపై ఆధారపడే పరిస్థితి ఉంటే అది ప్రమాదకరం. ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య ప్రభుత్వ హాస్టళ్ల కొరత. ఢిల్లీ విశ్వవిద్యాలయం వంటి భారీ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటే అందుబాటులో ఉన్న హాస్టల్ సామర్థ్యం దానికి చాలా తక్కువగా ఉండటం ప్రైవేటు పిజి సదుపాయంపై ఆధారపడే పరిస్థితిని పెంచుతుంది.
ప్రభుత్వ, విశ్వవిద్యాలయ హాస్టళ్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచకుండా ప్రైవేటు వసతులపై నియంత్రణ పెంచడం ఒక్కటే పరిష్కారం కాదు. హాస్టళ్ల కొరత పెరిగిన కొద్దీ విద్యార్థుల అవసరాన్ని వ్యాపార అవకాశంగా చూసే మార్కెట్ ఏర్పడుతుంది. ఆ మార్కెట్లో మంచి వసతి కల్పించే నిర్వాహకులు ఉంటారు. అదే సమయంలో తక్కువ స్థలంలో ఎక్కువ మందిని ఉంచి అధిక అద్దె వసూలు చేసే వారు కూడా ఉంటారు.
నియంత్రణ బలహీనంగా ఉంటే రెండో రకమైన వ్యాపారమే వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యవస్థలో విద్యార్థి అత్యంత బలహీనమైన వ్యక్తి. అతనికి భవనం గురించి సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. నిర్మాణ అనుమతులు ఎలా పరిశీలించాలో తెలియదు. అగ్నిమాపక ధ్రువీకరణ అసలైనదో కాదో గుర్తించడం కష్టం. యజమాని చెప్పే మాటను నమ్మడం తప్ప మరో మార్గం ఉండదు.
వసతి కోసం డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రశ్నలు అడిగే విద్యార్థికి మరో గది దొరుకుతుందనే హామీ కూడా ఉండదు. అందుకే పిజి వ్యవస్థను కేవలం అద్దె వ్యాపారంగా కాకుండా విద్యార్థి సంక్షేమ అంశంగా చూడాలి.
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల విద్యా హక్కుతో పాటు సురక్షితమైన వసతి అవసరాన్ని కూడా గుర్తించాలి. స్థానిక సంస్థలు పిజిలను ఒక ప్రత్యేక నియంత్రిత వర్గంగా పరిగణించి నమోదు, తనిఖీ, ధ్రువీకరణ వ్యవస్థను రూపొందించాలి.
ఇటీవల జరిగిన ఇతర అగ్ని ప్రమాదాలు, భవన ప్రమాదాల తర్వాత కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం సాధారణ పరిపాలనా పద్ధతిగా మారింది. కానీ కమిటీ ఏర్పాటే పరిష్కారం కాదు. ఎన్ని భవనాలను తనిఖీ చేశారో, ఎన్ని ఉల్లంఘనలు గుర్తించారో, ఎన్ని నోటీసులు ఇచ్చారో, ఎన్ని భవనాలను మూసివేశారో, ఎన్ని కేసుల్లో చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. తనిఖీ వ్యవస్థకు గడువు, బాధ్యత, పర్యవేక్షణ ఉండాలి. ముఖ్యంగా అధికారులకు కూడా జవాబుదారీతనం ఉండాలి.
ఒక ప్రమాదకరమైన భవనం గురించి ముందే సమాచారం ఉంటే దానిపై చర్య ఎందుకు తీసుకోలేదు? నోటీసు ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణం కొనసాగితే ఎవరు పర్యవేక్షించారు? తనిఖీ జరగకపోతే ఎందుకు జరగలేదు? ఒక ప్రాంతంలో అక్రమ పిజిలు విస్తరిస్తున్నాయని తెలిసినా చర్య తీసుకోకపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేకపోతే ప్రతి ప్రమాదం తర్వాత యజమానిని అరెస్టు చేయడం ద్వారా వ్యవస్థ తన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. సత్యనికేతన్ ఘటనపై నమోదైన కేసును సుప్రీంకోర్టు ఈనెల 10న పరిశీలించనున్న నేపథ్యంలో, దీనికి ప్రాధాన్యం పెరిగింది.
దేశవ్యాప్తంగా అనధికారిక నిర్మాణాలు, నివాస భవనాల వాణిజ్య వినియోగం, అగ్నిమాపక భద్రత వంటి అంశాలపై ఇప్పటికే విచారణ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల వసతిని కూడా విస్తృత భద్రతా విధానంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే న్యాయస్థానాల జోక్యం శాశ్వత పరిష్కారం కాదు.
ప్రతి ప్రమాదం తర్వాత కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్య పరిపాలనకు ఆరోగ్యకరం కాదు. స్థానిక సంస్థలు ముందుగానే పనిచేయాలి. విద్యా సంస్థలు తమ విద్యార్థుల వసతి పరిస్థితులను పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించాలి. కేంద్ర స్థాయిలో కనీస భద్రతా ప్రమాణాలు రూపొందించాలి.
ఎంతోమంది మాదిరిగానే, ఈ ఏడుగురు విద్యార్థులు కూడా తమ కుటుంబాలను వదిలి ఢిల్లీకి వచ్చారు. వారి లక్ష్యం భవిష్యత్తును నిర్మించుకోవడం. ఒక సురక్షితమైన గదిలో నిద్రించడం కోసం వారు ప్రత్యేక హక్కు అడగలేదు. అది వారి ప్రాథమిక హక్కుల పరిధిలోకి వచ్చే కనీస భద్రత.
విద్యార్థుల కలల నగరాలు వారి సమాధుల నగరాలుగా మారకూడదు. పిజి భవనం యజమాని లాభం, స్థానిక సంస్థల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, హాస్టళ్ల కొరత, నియంత్రణ లేని అద్దె మార్కెట్—ఈ అంశాలన్నింటినీ కలిపి చూసినప్పుడే సత్యనికేతన్ విషాదానికి అసలు పరిమాణం అర్థమవుతుంది.
ఇది ఒక భవనం కూలిన కథ కాదు. విద్య కోసం ఇంటి నుంచి బయలుదేరిన యువతకు ఈ దేశం ఎంత సురక్షితమైన నివాసాన్ని కల్పించగలుగుతోంది అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు సత్యనికేతన్లో మరణించిన ఏడుగురి విషాదం ముగిసినట్టుగా భావించలేం.