మోదీ సర్కారు వైఫల్యాలపై రాహుల్ గాంధీ పోరుబాట..దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు..
Congress Launches Nationwide Campaign on Paper Leaks and Youth Unemployment
దేశంలో వరుసగా జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థలోని కుంభకోణాలు, నిరుద్యోగ సమస్యలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిరసనల కార్యాచరణను అధికారికంగా వెల్లడించారు.
ఇటీవల దేశాన్ని కుదిపేసిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, సీబీఎస్ఈ (CBSE) పరీక్షా ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ ఈ పోరాటానికి పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు, యువత, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ వర్గాల హక్కుల కోసం విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పలు ప్రైవేట్ సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ నిరసనల్లో భాగంగా రాహుల్ గాంధీ స్వయంగా దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో పర్యటించి ఆందోళనల్లో పాల్గొననున్నారు. జూన్ 17వ తేదీన దేశంలోనే కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్లోని ‘కోటా’లో విద్యార్థులతో కలిసి ఆయన నిరసన చేపట్టనున్నారు. దానితో పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, బిహార్లోని పట్నా మరియు దేశ రాజధాని ఢిల్లీలలో యువత, నిరుద్యోగులతో కలిసి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.