Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Independence Day in Telugu : 72 గంటల పోరాటం.. చైనా సైన్యాన్ని గడగడలాడించిన ఇద్దరు గిరిజన యువతులు, ఓ సైనికుడి వీరగాథ గురించి ఎవరికైనా తెలుసా..

Prajapaksham 14 Aug 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Independence Day in Telugu : 72 గంటల పోరాటం.. చైనా సైన్యాన్ని గడగడలాడించిన ఇద్దరు గిరిజన యువతులు, ఓ సైనికుడి వీరగాథ గురించి ఎవరికైనా తెలుసా..

Sela and Nura

Independence Day in Telugu : 1962 భారత్-చైనా యుద్ధం నాటి చారిత్రాత్మక ఘట్టాలు నేటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి రగిలిస్తూనే ఉంటాయి. సైనిక శిక్షణ లేకపోయినా, కేవలం దేశభక్తితో ఒక భారతీయ సైనికుడికి అండగా నిలిచి.. చైనా దళాలను 72 గంటల పాటు నిలువరించిన ఇద్దరు వీరనారీమణులు సెలా (Sela), నూరా (Nura)ల త్యాగం భారత సాయుధ బలగాల చరిత్రలోనే అత్యంత అరుదైన కథనంగా నిలిచింది.

1962 యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దుల్లో చైనా సైన్యం వేలాదిగా విరుచుకుపడుతున్న వేళ.. 4వ గర్హ్వాల్ రైఫిల్స్‌కు చెందిన జస్వంత్ సింగ్ రావత్ అనే భారత సైనికుడు వెనక్కి తగ్గకుండా శత్రువులను ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో కొండల్లో నివసించే ‘మోన్పా’ గిరిజన తెగకు చెందిన అక్కాచెల్లెళ్లు సెలా, నూరా ఆయనకు సహాయంగా నిలిచారు.

జస్వంత్ సింగ్ వ్యూహం ప్రకారం.. కొండపై ఉన్న వేర్వేరు బంకర్లలో ఆయుధాలను అమర్చారు. సెలా, నూరాలు ప్రాణాలను పణంగా పెట్టి ఒక బంకర్ నుంచి మరొక బంకర్‌కు మందుగుండు సామాగ్రి, ఆహారం అందించేవారు. జస్వంత్ సింగ్ నిరంతరం బంకర్లు మారుస్తూ కాల్పులు జరపడంతో, అక్కడ కొండపై భారీ సంఖ్యలో భారత సైన్యం ఉందనే భ్రమలో చైనా దళాలు ఉండిపోయాయి.

Sela and Nura
Sela and Nura

ఈ ముగ్గురు కలిసి ఏకంగా 300 మందికి పైగా చైనా సైనికులను మట్టుబెట్టారు. 3 రోజుల పాటు చైనా ఆర్మీని అంగుళం కూడా ముందుకు కదలకుండా నిలువరించారు. అయితే మూడో రోజు అక్కడ ఉన్నది ఒక్కడే సైనికుడని చైనా దళాలకు తెలియడంతో.. బంకర్లపై ఒకేసారి బాంబుల వర్షం కురిపించారు. ఈ విపరీతమైన దాడిలో సెలా అక్కడికక్కడే వీరమరణం పొందగా.. నూరాను చైనిజ్ సైనికులు దారుణంగా హత్య చేశారు. ఇక చైనా దళాలకు చిక్కకూడదని భావించి జస్వంత్ సింగ్ కూడా చివరి తుపాకీ గుండుతో అమరుడయ్యాడు.

ఈ అమరవీరుల త్యాగానికి గుర్తుగా అరుణాచల్ ప్రదేశ్‌లో కొండ మార్గానికి సెలా పాస్” (Sela Pass) అని, సమీపంలోని జలపాతానికి నూరానాంగ్ జలపాతం (Nuranang Falls) అని నామకరణం చేశారు. జస్వంత్ సింగ్ జ్ఞాపకార్థం అక్కడ జస్వంత్‌గఢ్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. భారతదేశ సరిహద్దులను కాపాడటంలో ఈ గిరిజన సోదరీమణులు చూపిన ధైర్యం చిరస్మరణీయం.