ట్రంప్-నెతన్యాహూ హాట్ కాల్ మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ.. ఇంతకీ ఆ కాల్ సారాంశం నిజమేనా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య సోమవారం జరిగిన ఫోన్ సంభాషణ అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా అత్యంత సన్నిహితంగా ఉండే ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య ఈ స్థాయిలో వాదోపవాదాలు, ఘాటైన పదజాలం చోటుచేసుకోవడం ఇరు దేశాల మధ్య అంతర్గతంగా ముదురుతున్న ఉద్రిక్తతలను మొదటిసారిగా బహిర్గతం చేసింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న సైనిక చర్యల కారణంగా… ఇరాన్తో అమెరికా అత్యంత వ్యూహాత్మకంగా జరుపుతున్న పరోక్ష దౌత్య చర్చలకు గండిపడుతోందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా ప్రముఖ మీడియా సంస్థ ‘అక్సియోస్’ (Axios) కథనం ప్రకారం.. ఈ ఫోన్ కాల్ సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన తీవ్ర అసహనాన్ని, కోపాన్ని ఏమాత్రం దాచుకోలేదు. అత్యంత నమ్మకమైన అమెరికా ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలం వాడుతూ… నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేనే నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఇప్పుడు నీ చర్యల వల్ల ప్రపంచమంతా నిన్ను ద్వేషిస్తోంది, నీ వల్ల ఇజ్రాయెల్ను కూడా అందరూ ద్వేషిస్తున్నారు” అని నిలదీశారు.
మరో అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ట్రంప్ ఒక దశలో… “అసలు ఏం చేస్తున్నావ్ నువ్వు?”* అని గట్టిగా అరిచారు. ఇజ్రాయెల్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయడమే కాకుండా, పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న దౌత్య ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీస్తాయని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
ఈ వివాదం ముదరడానికి ప్రధాన కారణం లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ తన దాడులను ఒక్కసారిగా తీవ్రతరం చేయడమే. ముఖ్యంగా బీరూట్ నగర శివార్లలోని దహియే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున వైమానిక దాడులకు, భూతల దళాల విస్తరణకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. కేవలం ఒక హిజ్బుల్లా కమాండర్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ ఏకంగా భారీ భవనాలను కూల్చివేయడం, దీనివల్ల లెబనాన్లో సామాన్య పౌరుల మరణాలు భారీగా పెరగడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ దాడులను సాకుగా చూపుతూ, తాము అమెరికాతో జరుపుతున్న ప్రాథమిక అణు మరియు శాంతి చర్చల నుండి పూర్తిగా తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్న ట్రంప్, నెతన్యాహు మొండివైఖరి తన ప్రతిష్టాత్మక ప్రయత్నాలకు గండికొట్టేలా ఉందని భావించారు.
ట్రంప్ చేసిన ఈ తీవ్ర హెచ్చరికల ఫోన్ కాల్ తర్వాత ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో స్పందిస్తూ… బీరూట్ వైపు వెళుతున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిరగాల్సిందిగా తాను నెతన్యాహును కోరానని, అందుకు ఆయన అంగీకరించి సైన్యాన్ని వెనక్కి రప్పించారని ప్రకటించారు. అలాగే మధ్యవర్తుల ద్వారా హిజ్బుల్లా ప్రతినిధులు కూడా ఇజ్రాయెల్ సైనికులపై దాడులు ఆపేందుకు అంగీకరించారని, ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ తాత్కాలికంగానైనా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం ఈ సంభాషణను భిన్నంగా చూపే ప్రయత్నం చేసింది. హిజ్బుల్లా గనుక కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తాము బీరూట్పై దాడులు చేసి తీరుతామని తానే ట్రంప్కు స్పష్టం చేసినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. ప్రస్తుతానికి బీరూట్పై భారీ దాడుల ప్రణాళికను ఇజ్రాయెల్ తాత్కాలికంగా పక్కనబెట్టినప్పటికీ, ఇజ్రాయెల్ పౌరులపై ఎక్కడ దాడి జరిగినా లెబనాన్లో తమ సైనిక చర్యలు యథావిధిగా కొనసాగుతాయని నెతన్యాహు గట్టిగా స్పష్టం చేశారు.