Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఒక్కరోజులో అద్భుతాలు ఏవీ జరగవు

Prajapaksham 13 Jul 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఒక్కరోజులో అద్భుతాలు ఏవీ జరగవు

ప్రతీకాత్మకచిత్రం

సాహిత్యం అనేది కాలం రాసిన మనిషి ఆత్మకథ. ఏ ఒక్క రచన లేదా పుస్తకం ఒక్కరోజులో విప్లవాన్ని తీసుకురాదు. మార్పును శాసించదు. కానీ ఒక ఆలోచనను నాటుతుంది. ఆ ఆలోచనే తరువాత ఉద్యమంగా, సంస్కరణగా, చట్టంగా, సామాజిక మార్పుగా రూపాంతరం చెందుతుంది.

హ్యారియట్‌ బీచర్‌ స్టో రాసిన ‘అంకుల్‌ టామ్స్‌ కేబిన్‌’ అమెరికాలో బానిసత్వంపై ప్రజల దృష్టిని మలిచింది. రష్యాలో గోర్కీ రచనలు కార్మిక వర్గ చైతన్యానికి బలం చేకూర్చాయి. మన దేశంలో గురజాడ, శ్రీశ్రీ, చలం, కాళోజీ, దాశరథి వంటి రచయితల సాహిత్యం సామాజిక చర్చలకు దారితీసింది.

కాబట్టి సాహిత్యం నేరుగా ప్రభుత్వాలను మార్చకపోయినా, మనుషుల మనస్సులను మార్చుతుంది. మనస్సులు మారితే సమాజం కూడా మారుతుంది.

ఇక ప్రస్తుతం ప్రపంచంలో ధనికులు మరింత ధనవంతులు, పేదలు మరింత పేదలవుతున్నారని చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో సాహిత్యం పాత్ర ఏమిటి? అనే అత్యంత కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమానతలు పెరుగుతున్నాయి. కొద్దిమంది వద్ద అపార సంపద కేంద్రీకృతమవుతుండగా, కోట్లాది మంది ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాహిత్యం మౌనంగా ఉండకూడదు. అసమానతను ప్రశ్నించడం, శ్రమకు గౌరవం ఇవ్వడం, మనిషి గౌరవప్రదమైన జీవితం గడపాలనే ఆకాంక్షను బలపరచడం సాహిత్యం బాధ్యత.

అందుకే అభ్యుదయ, వామపక్ష సాహిత్యం ఇప్పటికీ తన ప్రాసంగికతను కోల్పోలేదు. ఏ భావజాలమైనా ద్వేషాన్ని కాదు, మానవత్వాన్ని పెంపొందించాలి. ఒక సిద్ధాంతం మనిషి కంటే పెద్దదిగా మారితే అది సాహిత్యం కాదు, ప్రచార పత్రం మాత్రమే అవుతుంది.

భావజాలం ఉండాలి. కానీ, అది కళాత్మకతను దెబ్బతీయకూడదు. ఈ విషయాన్ని చాలా మంది రచయితలు మరిచిపోతారు. గొప్ప ఆలోచన ఉండడం మాత్రమే గొప్ప సాహిత్యానికి సరిపోదు. అదే విధంగా కేవలం అందమైన భాష కూడా సరిపోదు. ఈ రెండూ కలిసినప్పుడే గొప్ప రచన పుడుతుంది.

ఏదేమైనా సాహిత్యం నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంటుంది. ఉదాహరణకు, నేటి డిజిటల్‌ యుగంలో ప్రచండ వేగంతో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సహజంగా, ప్రతి కొత్త సాంకేతిక మార్పు వచ్చినప్పుడు ఇలాంటి ఆందోళనలు వ్యక్తమవుతాయి.

ముద్రణా యంత్రం వచ్చినప్పుడు కూడా ఇలాగే భయపడ్డారు. రేడియో వచ్చినప్పుడు పుస్తకాలు చదవడం తగ్గిపోతుందని అనుకున్నారు. టెలివిజన్‌ వచ్చినప్పుడు కూడా అదే వాదన వినిపించింది. సోషల్‌ మీడియా ఒక సాధనం మాత్రమే. దానిని ఎలా ఉపయోగిస్తామన్నదే ముఖ్యం.

ఒకవైపు పైపైన చదివే అలవాటు పెరిగిందనేది నిజం. మరోవైపు వేలాది కొత్త రచయితలకు తమ రచనలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కూడా లభించింది.

ఒక రచయిత సమాజం కోసం రాయాలా? లేక తన సంతృప్తి కోసం రాయాలా? అనే ప్రశ్న ఉద్భవించక మానదు. కానీ, నిజం చెప్పాలంటే, ఈ రెండూ పరస్పర విరుద్ధాలు కావు.

నిజమైన రచయిత తన అంతరంగం నుంచి రాస్తాడు. కానీ ఆ అంతరంగం సమాజంతో విడిపోని సంబంధం కలిగి ఉంటుంది. మనిషి ఒంటరిగా జీవించడు. అందుకే వ్యక్తిగత అనుభవం కూడా చివరికి సామాజిక అనుభవంగానే మారుతుంది.

గొప్ప రచయిత తన వ్యక్తిగత బాధను మానవజాతి బాధగా, తన వ్యక్తిగత ఆనందాన్ని మానవజాతి ఆనందంగా మలచగలడు.

ట్యాగ్‌లు: editorial