Skip to content
బిజినెస్ వార్తలు

Tata Sons Leadership Update: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. మరో 5 ఏళ్ల పాటు చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్..

jagan 17 Sep 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Tata Sons Leadership Update: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. మరో 5 ఏళ్ల పాటు చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్..

N Chandrasekaran tata Sons

Tata Sons Leadership Update: టాటా గ్రూప్ భవిష్యత్ నాయకత్వంపై కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ.. కీలక మలుపు తిరిగింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ బోర్డు గురువారం నాడు ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించేందుకు ఆమోదం తెలిపినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

ఇదే సమయంలో టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు అంశాలపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఎన్‌డీటీవీ ప్రాఫిట్ సహా పలు మీడియా సంస్థలు వర్గాలను ఉటంకిస్తూ నివేదించాయి.

ఎన్. చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022లో ఆయనకు రెండో ఐదేళ్ల పదవీకాలం లభించింది. ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియాల్సి ఉంది. అయితే ఆగస్టులో చంద్రశేఖరన్ మరోసారి పదవిని చేపట్టేందుకు ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా బోర్డు అభ్యర్థనతో ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి మూడోసారి బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు రాయిటర్స్, ఎన్‌డీటీవీ ప్రాఫిట్ నివేదికలు పేర్కొన్నాయి.

అయితే ఈ నియామకానికి నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. టాటా ట్రస్ట్స్‌కు టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉండటంతో, ఈ అంశంలో ట్రస్ట్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, బోర్డు ఆమోదించిన నిర్ణయాలకు తదుపరి ఏజీఎం ఆమోదం అవసరం కావచ్చు.
టాటా సన్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అంశం కూడా ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. టాటా సన్స్‌ను 2022లో ఆర్‌బీఐ ‘అప్పర్ లేయర్’ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా వర్గీకరించింది. ఈ కేటగిరీలోని సంస్థలకు లిస్టింగ్‌కు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి.

టాటా సన్స్ గతంలో తన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను స్వచ్ఛందంగా రద్దు చేసుకునేందుకు ఆర్‌బీఐని కోరింది. అయితే సెప్టెంబర్ 11న ఆర్‌బీఐ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో కంపెనీపై వర్తించే అప్పర్-లేయర్ NBFC నిబంధనల ప్రకారం లిస్టింగ్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బోర్డు కూడా లిస్టింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో టాటా సన్స్ భవిష్యత్తులో పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీగా మారే ప్రక్రియకు మరింత స్పష్టత వచ్చినట్లైంది.

చంద్రశేఖరన్ కొనసాగింపుతో పాటు లిస్టింగ్ ప్రతిపాదనపైనా నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఎన్‌డీటీవీ ప్రాఫిట్ వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. టాటా ట్రస్ట్స్‌కు ఉన్న హక్కులు, టాటా సన్స్ పాలన, భవిష్యత్ వ్యూహాలపై కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బోర్డులోని ఇతర సభ్యుల వైఖరిపై వివిధ నివేదికల్లో భిన్నమైన వివరాలు ఉన్నాయి.

ఇటీవల టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) తగినంత కోరం లేకపోవడంతో వాయిదా పడింది. టాటా సన్స్‌లో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి అని నివేదికలు పేర్కొన్నాయి. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు సంబంధించిన ప్రతినిధిత్వ పరిమితులు, కంపెనీ ఆర్టికల్స్‌లోని కోరం నిబంధనలు దీనికి కారణమైనట్లు సమాచారం.

మొత్తంగా చూస్తే.. చంద్రశేఖరన్ మూడోసారి ఛైర్మన్‌గా కొనసాగడం, టాటా సన్స్ లిస్టింగ్ ప్రక్రియను ప్రారంభించడం రెండూ ఒకేసారి చోటుచేసుకోవడం టాటా గ్రూప్‌కు కీలక పరిణామంగా మారింది. అయితే నోయెల్ టాటా అభ్యంతరం, టాటా ట్రస్ట్స్ పాత్ర, తదుపరి వాటాదారుల ఆమోదం వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. లిస్టింగ్ ప్రక్రియ ఏ రూపంలో, ఏ కాలవ్యవధిలో ముందుకు సాగుతుందన్నది కూడా ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.