KTR At ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు.. కేటీఆర్ హాజరు..ఫార్ములా-ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా
KTR At ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు.. కేటీఆర్ హాజరు..ఫార్ములా-ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా
Formula E Race Case: ఏసీబీ కోర్టుకు కేటీఆర్.. తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా
KTR At ACB Court: ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఈ కేసులో కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం కేసు తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. కేటీఆర్తో పాటు కేసులో నిందితులుగా పేర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు హాజరయ్యారు.
రూ.55 కోట్ల బదిలీపైనే ప్రధాన అభ్యంతరం
హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో హెచ్ఎండీఏ నుంచి దాదాపు రూ.55 కోట్లను బదిలీ చేసిన వ్యవహారం ప్రధానంగా విచారణలో ఉంది.ఈ నిధుల బదిలీ సమయంలో అవసరమైన ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదని, నిర్దేశిత ఆర్థిక నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అనంతరం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
ఛార్జ్షీట్ తర్వాత సమన్లు
ఏసీబీ సమర్పించిన ఛార్జ్షీట్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న అనంతరం కేసులో పేర్కొన్న నిందితులకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేటీఆర్తో పాటు మిగతా ముగ్గురు శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు. గత విచారణకు వ్యక్తిగత కారణాల వల్ల కేటీఆర్ హాజరుకాలేదు. దీంతో ఆయన హాజరు కోసం విచారణను మరో తేదీకి వాయిదా వేశారు. తాజాగా కోర్టుకు హాజరైన నేపథ్యంలో విచారణ ప్రక్రియ కొనసాగింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.