ప్రభుత్వ పాఠశాల దుస్థితిని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?
Protest
ఒక పాఠశాల దుస్థితిని ప్రశ్నించిన గొంతు.. చివరకు ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం కనీస సౌకర్యాలు కోరిన ప్రశ్న కు సమాధానం దాడి, హత్యగా మారడం పశ్చిమ బెంగాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రశ్నించడమే నేరమైందా? పాఠశాల దుస్థితిని వీడియో తీసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించిన ఓ యువకుడి కుటుంబంపై జరిగిన దాడి తీవ్ర విషాదానికి దారితీసింది. పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లా ఇందాస్ బ్లాక్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువకుడి తండ్రి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందడం కలకలం రేపుతోంది. జెన్జీల ఆందోళనలకు అడ్డుపడ్డవాళ్లు ..ఇప్పుడు ఏకంగా హత్యలనే ఎంచుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నించినందుకే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందాస్ బ్లాక్కు చెందిన 26 ఏళ్ల షేక్ అబ్దుల్ హఫీజ్ తన గ్రామంలోని ప్రాథమిక
పాఠశాల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాడు.
విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? పాఠశాల నిర్వహణ ఎలా ఉంది? అనే అంశాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆగస్టు 13న పాఠశాలకు వెళ్లాడు. అక్కడి పరిస్థితులను వీడియోలో చిత్రీకరించేందుకు ప్రధానోపాధ్యాయుడి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ‘స్కూల్ టీక్ కరో’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, నిధుల వినియోగంలో పారదర్శకత కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగానే అబ్దుల్ హఫీజ్ ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అబ్దుల్ పాఠశాలకు వెళ్లి వీడియో తీసేందుకు ప్రయత్నించిన విషయం స్థానికంగా వివాదానికి దారితీసిన ట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు రాత్రి కొందరు వ్యక్తులు అబ్దుల్ ఇంటిపై దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముందుగా ఇంటి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కర్రలు, ఇనుప రాడ్లు, సూలాలతో గుంపుగా ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు. తన కుమారుడిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రి షేక్ మహమ్మద్ మఫీక్పై దుండగులు తీవ్రంగా దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆగస్టు 15న మృతి చెందినట్లు పేర్కొన్నారు.
‘పాఠశాల బాగుపడాలని కోరితే తప్పేంటి?’
తన తండ్రిని కోల్పోయిన అబ్దుల్ హఫీజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మా ఊరి పాఠశాల బాగుపడాలి.. పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించాలి అని కోరడ మే నేను చేసిన తప్పా? అంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రజా సమస్యను ప్రశ్నించి, పాఠశాల పరిస్థితులను వీడియో ద్వారా చూపించాలనుకున్నందుకు తమ కుటుంబాన్ని ఎందు కు లక్ష్యంగా చేసుకున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ దాడి వెనుక స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తల హస్తం ఉందని బాధిత కుటుంబం, స్థానిక నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షల కారణంగానే అబ్దుల్ కుటుంబంపై దాడి జరిగిందని వారు మండిపడుతున్నారు.
అయితే ఈ ఆరోపణలపై సంబంధిత బిజెపి నాయకుల అధికారిక స్పందన ఏమిటన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరడం ప్రజల హక్కు అని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. పాఠశాల పరిస్థితులను ప్రశ్నించినందుకు ఒక కుటుంబం దాడికి గురై, చివరకు ఒక ప్రాణం పోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే వారిపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం, ప్రజా సంఘా లు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనకు రాజకీయ రంగు పులమకుండా, అసలు దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.