Skip to content
తెలంగాణ వార్తలు

Konda Sushmitha Remarks: ప్లాన్-బీలో సుస్మిత ఏం చేస్తుందో నాకేం తెలుస్తుంది.. కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు..

jagan 26 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Konda Sushmitha Remarks: ప్లాన్-బీలో సుస్మిత ఏం చేస్తుందో నాకేం తెలుస్తుంది.. కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు..

Konda Murali

Konda Sushmitha Remarks: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్‌రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో కొండా మురళి రంగంలోకి దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కీలక కాంగ్రెస్ నేతలను ఆయన కలిశారు.

సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల నియోజకవర్గ టికెట్ కేటాయింపులకు సంబంధించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో వివాదం మరింత వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు.

ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. సుస్మితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఇవ్వాల్సిన వివరణ ఇచ్చాం” అని ఆయన పేర్కొన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై స్పందిస్తూ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కొండా సుస్మిత నా బిడ్డ. ప్లాన్-ఏలో ఆమె అలా మాట్లాడింది. ప్లాన్-బీలో ఏం చేస్తుందో నాకేం తెలుస్తుంది? ఆ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన సమావేశం అధికారిక అంశాలపైనే జరిగిందని కొండా మురళి స్పష్టం చేశారు. బిల్లులకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకే భట్టిని కలిసినట్లు తెలిపారు.

కొండా మురళి, భట్టి విక్రమార్కతో సమావేశమైన సమయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు ఇటీవల ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు పార్టీ క్రమశిక్షణ అంశంపై అధిష్ఠానం దృష్టి పెట్టగా, మరోవైపు రాష్ట్రంలోని కీలక నేతల మధ్య వరుస సమావేశాలు జరుగుతుండటం కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలపై ఆసక్తిని పెంచుతోంది.

కొండా సురేఖ కుటుంబం చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారంగా మారింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా స్పందిస్తూ పార్టీ క్రమశిక్షణను పాటించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొండా మురళి తాజా భేటీలు, ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో భాగమా? లేక తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.