Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Raksha Bandhan 2026: రాఖీ కట్టేందుకు బెస్ట్ టైమ్ ఏది.. అన్నకు, తమ్ముడికి ఏ సమయంలో రాఖీ కట్టాలి? శుభ ముహూర్తం తెలుసుకోండి

jagan 26 Aug 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Raksha Bandhan 2026: రాఖీ కట్టేందుకు బెస్ట్ టైమ్ ఏది.. అన్నకు, తమ్ముడికి ఏ సమయంలో రాఖీ కట్టాలి? శుభ ముహూర్తం తెలుసుకోండి

Raksha Bandhan

Raksha Bandhan 2026: సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పండితులు తెరదించారు. ఈ ఏడాది రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోవాలని పంచాంగకర్తలు, పండితులు స్పష్టం చేశారు. రాఖీ కట్టేందుకు శుక్రవారం ఉదయం సమయం అత్యంత అనుకూలంగా ఉంటుందని తెలిపారు

హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 గురువారం ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా పండుగల నిర్ణయంలో సూర్యోదయానికి ఉన్న తిథిని పరిగణనలోకి తీసుకోవడం ఆనవాయితీ. దీంతో ఆగస్టు 28న సూర్యోదయ సమయంలో పౌర్ణమి తిథి ఉండటంతో అదే రోజున రక్షాబంధన్ జరుపుకోవడం శాస్త్రోక్తమని పండితులు చెబుతున్నారు.

27న ఎందుకు వద్దంటే?

ఆగస్టు 27న ఎక్కువ సమయం భద్ర కాలం ఉండటంతో ఆ రోజున రాఖీ కట్టడం, ఇతర శుభకార్యాలు నిర్వహించడం అనుకూలం కాదని పండితులు సూచిస్తున్నారు. అందువల్ల 27వ తేదీ కంటే 28వ తేదీకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆగస్టు 28న ఉదయం రాఖీ కట్టేందుకు అనుకూలమైన సమయం ఉందని పండితులు తెలిపారు. ఉదాహరణకు ఢిల్లీలో ఉదయం 5:57 గంటల నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చని పేర్కొన్నారు. అయితే నగరాన్ని బట్టి సూర్యోదయ సమయాల్లో స్వల్ప తేడాలు ఉండటంతో ముహూర్తంలో కూడా మార్పులు ఉండవచ్చని తెలిపారు. కాబట్టి స్థానిక పంచాంగాన్ని పరిశీలించడం మంచిదని సూచించారు.

చంద్రగ్రహణం ఉన్నా.. ఆందోళన అవసరం లేదు

ఇదే రోజున పాక్షిక చంద్రగ్రహణం ఉన్నప్పటికీ అది భారత్‌లో కనిపించదని పండితులు తెలిపారు. చంద్రుడు భారతదేశం నుంచి చూసినప్పుడు క్షితిజం కంటే దిగువన ఉండటం వల్ల గ్రహణం గోచరించదని పేర్కొన్నారు. అందువల్ల భారతదేశంలో గ్రహణ సూతక నియమాలు వర్తించవని, రక్షాబంధన్ వేడుకలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.

రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులు సోదరులకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి రాఖీ కడతారు. సోదరుల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాల కోసం ప్రార్థిస్తారు. సోదరులు కూడా తమ సోదరీమణులను రక్షిస్తామని హామీ ఇస్తూ కానుకలు అందిస్తారు. 2026లో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకోవడమే శుభమని పంచాంగకర్తలు స్పష్టం చేశారు.