ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం..ఇరాన్ తాజా దాడులతో హార్ముజ్జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు..
Strait of Hormuz
అమెరికా రక్షణలో ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో హోర్ముజ్ గుండా నౌకల రాకపోకలు మందగించగా, ప్రపంచ చమురు సరఫరా మరియు ధరలపై ఆందోళనలు పెరిగాయి.
అమెరికా, ఇరాన్ల మధ్య అంతర్జాతీయ జలసంధి హార్జుజ్ వద్ద రగిలిన ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా అమెరికా వైమానిక దళాల రక్షణలో.. ప్రయాణించేందుకు ప్రయత్నించిన రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసి వాటిని నిలిపివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది.
తమ అనుమతి లేకుండా.. నిర్దేశిత మార్గానికి భిన్నంగా వెళ్లేందుకు ప్రయత్నించినందునే వాటిని అడ్డుకున్నామని.. ఈ ఘటనతో మరో నాలుగు ట్యాంకర్లు తమ మార్గాన్ని మార్చుకుని వెనుదిరిగాయని ఇరాన్ సైన్యం పేర్కొంది. ప్రస్తుతం ఈ జలసంధిపై తమకు సంపూర్ణ నియంత్రణ ఉందని.. ఇరాన్ నుంచి ప్రత్యేక అనుమతి పొందిన వాణిజ్య నౌకలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు ఇరాన్ వ్యాఖ్యలను అమెరికా తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గమని, వాణిజ్య నౌకలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఐఆర్జిసి ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉచిత నౌకాయానానికి ఈ మార్గం తెరిచే ఉంటుందని అమెరికా బలగాలు స్పష్టం చేశాయి. కాగా, ఇటీవల ఇరాన్ వాణిజ్య నౌకల నుంచి అక్రమంగా రవాణా రుసుములు, ఇన్సూరెన్స్ ముసుగులో డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ ఐఆర్జిసితో సంబంధం ఉన్న పలు సంస్థలపై ట్రంప్ యంత్రాంగం కొత్త ఆంక్షలు విధించింది.
ఇటీవల ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన అనంతరం ఇరాన్ ఈ జలసంధిపై దిగ్బంధనాన్ని పునరుద్ధరించింది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతానికి పైగా ఈ హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుండటంతో.. ప్రస్తుత ప్రతిష్టంభన కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, సహజ వాయువు ధరలలో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా ఇటీవల జరిపిన ప్రతీకార వైమానిక దాడులకు నిరసనగా.. తమపై దాడికి దిగే దురాక్రమణదారులను ఖచ్చితంగా శిక్షిస్తామని, అమెరికాకు సహకరించే దేశాలకు కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
- Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 అడుగులుకు చేరిన నీటి మట్టం..రెండో ప్రమాద హెచ్చరికతో హై అలర్ట్..
- వీడియో ఇదిగో.. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.. మిత్రుడిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు..
- ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం..ఇరాన్ తాజా దాడులతో హార్ముజ్జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు..
- రైతులకు గుడ్న్యూస్.. పీఎం-కిసాన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం
- భ్రమలు గొలుపుతున్న కోచింగ్ సెంటర్లు