BRICS Summit 2026: ప్రపంచ శాంతిపై BRICS కీలక అడుగు.. ఏకపక్ష యుద్ధాలను ఖండించేలా సంయుక్త ప్రకటన.. జాయింట్ డిక్లరేషన్కు అంగీకారం..
BRICS Summit 2026
BRICS Summit 2026: బ్రిక్స్ దేశాల మధ్య కీలక అంశంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఏకపక్షంగా కొనసాగుతున్న యుద్ధాలను ఖండిస్తూ ఉమ్మడి తీర్మానం చేయాలని సభ్య దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఉమ్మడి తీర్మానంలో ఏ ఒక్క దేశం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా.. ఏకపక్ష సైనిక చర్యలు, యుద్ధాలను సాధారణంగా ఖండించేలా ప్రకటనను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ తీర్మానంపై అధికారిక ప్రకటన సాయంత్రం వెలువడే అవకాశం ఉంది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య ఇలాంటి ఏకాభిప్రాయాన్ని సాధించడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిక్స్ వేదికపై వివిధ దేశాలకు భిన్నమైన రాజకీయ, దౌత్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలకు ప్రాంతీయ రాజకీయాల్లో పరస్పర విభేదాలు ఉండటంతో యుద్ధాలు, సైనిక చర్యలపై ఒకే విధమైన వైఖరిని రూపొందించడం సవాలుగా మారింది. అయినప్పటికీ ఏ దేశాన్నీ నేరుగా లక్ష్యంగా చేసుకోకుండా, ఏకపక్ష యుద్ధాలను వ్యతిరేకించే సాధారణ సూత్రంపై సభ్య దేశాలు ఒకే మాటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో భారత్ అనుసరించిన దౌత్యపరమైన విధానం కీలకంగా మారినట్లు సమాచారం. సభ్య దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి, అందరూ అంగీకరించగలిగే అంశాల ఆధారంగా తీర్మానాన్ని రూపొందించేందుకు భారత్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఒక దేశాన్ని నేరుగా విమర్శించే భాషను ఉపయోగిస్తే ఏకాభిప్రాయం సాధించడం కష్టమయ్యే అవకాశం ఉండటంతో, అంతర్జాతీయ శాంతి, బహుళపక్షవాదం, దేశాల సార్వభౌమత్వం వంటి విస్తృత సూత్రాలను ప్రాతిపదికగా చేసుకుని తీర్మానాన్ని రూపొందించినట్లు సమాచారం.
అయితే ఈ తీర్మానం అమల్లోకి రావాలంటే బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. నేతల ఆమోదం అనంతరం ఉమ్మడి ప్రకటనను విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనలో యుద్ధాలు, ఏకపక్ష సైనిక చర్యలపై బ్రిక్స్ వైఖరితో పాటు ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సహకారం, బహుళపక్ష వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా సభ్య దేశాల అధినేతల మధ్య పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అబుదాబి యువరాజు ప్రిన్స్ ఖలేద్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ తదితరులు భారత్ మండపానికి చేరుకున్నారు. ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలు, సమ్మిళిత ప్రపంచ పరిపాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలు సదస్సులో ప్రధానంగా చర్చకు వస్తున్నాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా శనివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీతో ఆయన ద్వైపాక్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ భేటీపై కూడా అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా తదితర దేశాల అధినేతలు కూడా బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నారు.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో బ్రిక్స్ దేశాలు ఏకపక్ష యుద్ధాలకు వ్యతిరేకంగా ఉమ్మడి వైఖరిని ప్రకటించేందుకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ దేశాన్నీ నేరుగా ప్రస్తావించకుండా సభ్య దేశాలందరికీ ఆమోదయోగ్యమైన భాషలో తీర్మానాన్ని రూపొందించడం ద్వారా భారత్ దౌత్యపరంగా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా బ్రిక్స్ సదస్సు కొనసాగనుండటంతో తుది ప్రకటనలో ఎలాంటి అంశాలను పొందుపరుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
- CM Revanth Reddy: 25 ఏళ్ల క్రితమే పుప్పాలగూడ, కోకాపేటను ఏలిన.. రియల్ ఎస్టేట్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Aadarsha Kutumbam Teaser: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేసింది.. చిట్టిబాబుగా విక్టరీ విశ్వరూపం!
- Botsa Satyanarayana Crying Video: మరోసారి వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స…గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో కంటతడి
- BRICS New Delhi Declaration: UN సంస్కరణల నుంచి ఉగ్రవాదం వరకు.. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్లో కీలక తీర్మానాలు ఇవే..
- CM Revanth Reddy: పాలిటెక్నిక్ విద్యార్థులకు గుడ్న్యూస్… ప్రభుత్వ పాలిటెక్నిక్లను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.. అసెంబ్లీలో సీఎం స్పష్టీకరణ