MLA Malla Reddy: కారు దిగట్లేదు…గులాబీ గూటిలోనే కొనసాగుతున్నా…ఎమ్మెల్యే మల్లారెడ్డి కౌంటర్..
MLA Malla Reddy: కారు దిగట్లేదు...గులాబీ గూటిలోనే కొనసాగుతున్నా...ఎమ్మెల్యే మల్లారెడ్డి కౌంటర్..
MLA Malla Reddy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి గులాబీ గూటిలో అలజడి రేగుతోంది. కారు దిగి హస్తం గూటికో, కమలం వైపో అడుగులు వేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాపించింది. మేడ్చల్ మాస్ లీడర్, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు దిగబోతున్నారు.. పార్టీ మార్పు ఖాయం” అంటూ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా సెగలు రేగాయి!
బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆస్తులపై కొన్ని పరిణామాలు జరగడం, దాడుల పరంపర కొనసాగడంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనే టాక్ వినిపించింది. దీనికి తోడు ఆయన బీజేపీ పార్టీ ముఖ్య నేతలతో రహస్యంగా భేటీ అయ్యారంటూ కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. మల్లారెడ్డికి రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకుందని, అందుకే తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన అధికార పార్టీకి జై కొట్టబోతున్నారు, అంటూ బీఆర్ఎస్ మద్దతుగా నిలిచే సోషల్ మీడియా పేజీల్లోనే పోస్టులు వెల్లువెత్తాయి. ఎల్బీ నగర్ లో జరిగిన యువ సంగ్రామ సభకు మల్లారెడ్డి డుమ్మా కొట్టడం ఈ వాదనకు బలంగా నిలిచింది. దీంతో ఏ నిమిషంలో ఆయన పార్టీ కండువా మార్చుకుంటారో అని ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, మల్లారెడ్డి మౌనం వీడారు.
కానీ, ఊహాగానాల తుఫానుకు మల్లారెడ్డి తనదైన శైలిలో బ్రేకులు వేశారు. రాజకీయ పండితుల లెక్కలను తలకిందులు చేస్తూ ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనదైన పంఛ్ డైలాగులతో పుకార్ల గాలి తీసేశారు. “నేను పార్టీ మారుతున్నాననేది పచ్చి అబద్ధం. కారు దిగే ప్రసక్తే లేదు. నా ప్రయాణం ఎప్పటికీ బీఆర్ఎస్ తోనే!” అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.
సోషల్ మీడియాలో జరుగుతున్నది కేవలం దుష్ప్రచారమేనని, తన అనుచరులు, కార్యకర్తలు ఆ ఫేక్ వార్తలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. “పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా పనిచేశానో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. బీఆర్ఎస్ అధినాయకత్వంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది” అని ఆయన స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీని వీడే రకం తాను కాదని, క్షేత్రస్థాయిలో గులాబీ దళాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఒక సైనికుడిలా పోరాడుతానని ప్రకటించారు. మల్లారెడ్డి ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్తో గత కొద్ది రోజులుగా మేడ్చల్ రాజకీయాల్లో రేగిన దుమారం ఒక్కసారిగా చల్లారింది.