Skip to content
తెలంగాణ వార్తలు

వేములూరు ఆదీవాసీలపై అటవీ అధికారుల దౌర్జన్యం.. 10 మందిపై కేసు నమోదు.. సంబంధిత అధికారిపై విచారణ..

Prajapaksham 18 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
వేములూరు ఆదీవాసీలపై అటవీ అధికారుల దౌర్జన్యం.. 10 మందిపై కేసు నమోదు.. సంబంధిత అధికారిపై విచారణ..

వేములూరి ఆదీవాసీలపై అటవీ అధికారుల దౌర్జన్యం.. 10 మందిపై కేసు నమోదు.. సంబంధిత అధికారిపై విచారణ..

మణుగూరు రేంజ్ పరిధిలోని మనుబోతులగూడెం గ్రామపంచాయతీ నాగేశ్వరావు గుంపు వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై శనివారం అశ్వాపురం రేంజ్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ బి. బాబు మాట్లాడుతూ ఘటనకు సంబంధించి 10 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, సంబంధిత అధికారిపై కూడా విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

అడవుల సంరక్షణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన, అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ కలప రవాణా, అడవుల విధ్వంసాన్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేశారు. అటవీశాఖ సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని.. ఈ ఘటనపై వస్తున్న అపోహలు, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే అడవులను పరిరక్షించి భావితరాలకు పచ్చని తెలంగాణను అందించగలమని ఎఫ్డిఓ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మణుగూరు రేంజర్ ఉపేందర్, అశ్వాపురం రేంజర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.

కాగా అశ్వాపురం మండల పరిధిలోని మనుబోతులపాడు గ్రామపంచాయతీ పరిధి వేములూరు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై అటవీ శాఖ అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరతరాలుగా అటవీ ప్రాంతాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములూరు గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబాలు తమ జీవనాధారమైన పోడు భూములు, అటవీ ఆధారిత జీవన విధానానికి సంబంధించిన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై అనవసర ఒత్తిళ్లు తీసుకురావడం, భయాందోళనలకు గురిచేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు.

అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ప్రభుత్వం కల్పించిన హక్కులు, చట్టపరమైన రక్షణలు అమలు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు ప్రజలతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపాలని, ఘర్షణ వాతావరణం సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేములూరు గ్రామ ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి విచారణ చేపట్టాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. గిరిజనుల జీవన భద్రతకు భరోసా కల్పించి, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.