Polavaram Dispute: తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పోలవరం, బనకచర్ల పిటిషన్పై స్టే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన అత్యున్నత ధర్మాసనం..
Polavaram Dispute: తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పోలవరం, బనకచర్లపై పిటిషన్పై స్టే నిరాకరించిన అత్యున్నత ధర్మాసనం..
Polavaram Dispute: అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాల వినియోగం, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వంటి కీలక అంశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని దేశంలోని అత్యున్నత ధర్మాసనం విచారించింది.
కేసు విచారణ సందర్భంగా తెలంగాణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వివాదానికి సంబంధించిన కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పదంగా చేపడుతున్న పనులపై తక్షణమే స్టే (మధ్యంతర ఉత్తర్వులు) విధిస్తూ.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని ధర్మాసనాన్ని గట్టిగా కోరారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం.. అందులో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
ఈ ప్రాథమిక సాంకేతిక లోపాలను పూర్తిగా సరిచేసే వరకు కేసుపై ఎలాంటి విచారణ చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్లోని తప్పులను సవరించకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం కానీ.. పనులపై మధ్యంతర స్టే (ఇంజెక్షన్ ఆర్డర్) ఇవ్వడం కానీ కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ముందుగా పిటిషన్లో ఉన్న లోపాలన్నింటినీ నిబంధనల ప్రకారం సవరించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన న్యాయస్థానం.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మిగిలిన ప్రధాన అంశాలపై విచారణ జరుపుతామని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. జల వివాదాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణకు ఆదిలోనే సాంకేతిక లోపాలు అడ్డంకిగా మారాయి.