Kaleshwaram War: కాళేశ్వరం వివాదం.. తెలంగాణలో పతాక స్థాయికి చేరిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయ పోరు..
Kaleshwaram War: కాళేశ్వరం వివాదం.. తెలంగాణలో పతాక స్థాయికి చేరిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయ పోరు..
Kaleshwaram War: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్)పై రాజకీయ యుద్ధం నడుస్తోంది. తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత, మరమ్మతులపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా అధికార కాంగ్రెస్ పార్టీ..ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్తా.. ఇప్పుడు వీధి పోరాటాలుగా మారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాల ద్వారా వినూత్న నిరసనకు దిగగా.. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ అవినీతి కాళేశ్వరం పేరిట నిరసనతో ధ్వజమెత్తింది. ఈ పోటాపోటీ ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్, గాంధీ భవన్ పరిసరాలలో పోలీసులను భారీగా మోహరించారు.
ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ, కరవు పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి పంప్హౌస్ నుండి రైతులకు సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకే ముందడుగు వేస్తామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల అహంకారం, కొవ్వు పొలాలకు సరిపోతుందని.. వారిని కోసి రక్తాన్ని పొలాల్లో చల్లితే పంటలు పండుతాయంటూ.. వారికి ‘బెల్ట్ ట్రీట్మెంట్’ అవసరమని సీఎం వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు.. సీఎం మానసిక స్థితిని దుయ్యబట్టారు. రైతులు నీళ్లు అడుగుతుంటే ముఖ్యమంత్రి రక్తం అడుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే పీవీ నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) తెలంగాణ భవన్లో రేవంత్ రక్తదాహానికి రక్తదానం అనే నినాదంతో భారీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది. తాము సేకరించిన ఈ రక్తపు ప్యాకెట్లను నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లి అందిస్తామని.. ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులకు భయపడేది లేదని, రైతుల కోసం ఎంత రక్తమైనా చిందించడానికి సిద్ధమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. దీంతో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లకుండా పోలీసులు తెలంగాణ భవన్ వెలుపల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ నిరసనలకు అంతే దీటుగా స్పందించిన అధికార కాంగ్రెస్ పార్టీ.. గాంధీ భవన్లో అవినీతి కాళేశ్వరం పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట జరిగిన భారీ అవినీతిని.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వంటి సాంకేతిక లోపాలను ఎండగడుతూ పలు చిత్రపటాలను, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) ఫోటోలను ప్రదర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ శ్రేణులు కేవలం ఏటీఎంలా వాడుకున్నాయని.. ఈ మహా కుంభకోణంలో బాధ్యులైన వారెవరినీ వదిలిపెట్టబోమని, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.