Skip to content
తెలంగాణ వార్తలు

కేసిఆర్ అప్పుల‌తో పాటు అడ్డ‌గోలుగా త‌ప్పులు కూడా చేశారు… రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్…

Prajapaksham 30 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
కేసిఆర్ అప్పుల‌తో పాటు అడ్డ‌గోలుగా త‌ప్పులు కూడా చేశారు… రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్…

CM Revanth Reddy’s Key Message at Tungabhadra Brings New Hope for Farmers of Three States

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రైతు భరోసా నిధులను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన 2042 కోట్ల రూపాయల బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నేతలపైన ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని కేసీఆర్ పాలనను విమర్శించారు.

ప్ర‌కాశం పంతులు, బెజ‌వాడ గోపాల్ రెడ్డి, పాల‌మూరు బిడ్డ బూర్గుల రామక్రిష్షారావు నుంచి కిర‌ణ్ కుమార్ రెడ్డి వ‌ర‌కు తెలంగాణ‌కు ఇచ్చిన అప్పు 69 వేల కోట్లు. జూన్ 2, 2014 న తెలంగాణ ఏర్ప‌డినప్పుడు ఉన్న అప్పు 69 వేల కోట్లు మాత్ర‌మే. 2023 డిసెంబ‌ర్ 7 నాడు ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన స‌మ‌యంలో ఎనిమిది లక్షల ప‌ద‌కొండు వేల కోట్ల అప్పు ఉంది. 60 యేళ్ల‌లో 69 వేల కోట్ల అప్పులు చేస్తే, కేవ‌లం క‌ల్వ‌కుంట్ల కుటుంబం 7 ల‌క్ష‌ల కోట్ల కు పైగా అప్పు చేసి అప్పుల ఊబిలో నిండా ముంచారు. మ‌ళ్లీ లేవ‌డానికి వీలులేకుండా అప్పుల‌తో మ‌న్ను క‌ప్పారు. మేం 6 ల‌క్ష‌ల అప్పులు చేశార‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో విమ‌ర్శిస్తే కాంగ్రెస్ అబ‌ద్దాలు చెపుతుంద‌ని బుకాయించారు. అన్ని ర‌కాల అప్పులను తొవ్వితే గుట్ట‌ల కొద్ది బ‌య‌ట‌ప‌డ్డాయి, అందిన కాడికి చేబ‌దులు తీసుకువ‌చ్చారని సీఎం రేవంత్ దుయ్యబట్టారు

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు విడ‌త‌ల వారీగా జీతాలు ఇచ్చారు. క‌ష్ట‌మైనా ఫ‌స్టు తారీఖున జీతాలు ఇవ్వాల్సిందేన‌ని అధికారుల‌ను ఆదేశించాను. బ‌డి పిల్ల‌ల కూర‌గాయ‌లు, బ‌ట్ట‌ల‌కు కూడా చెల్లించ‌కుండా బ‌కాయిలు పెట్టారు. స‌ర్పంచ్ ల‌కు వంద‌ల కోట్లు బ‌కాయిలు పెట్టారు, స‌ర్పంచ్ లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. స‌ర్పంచ్ లు, ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు ధ‌ర్నాలు చేశారు. బ‌కాయిలు పెట్టింది బ‌కాసురులు, క‌ట్టే ప‌ని మాత్రం నాకు ప‌డింది. ఇనుప కంచెలు వేసుకుని నేను లోప‌ల లేను, గ‌ద్ద‌రన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు పోతే ఎండ‌లో నాలుగు గంట‌లు కూర్చోబెట్టాడు. షేర్వానీ వేసుకుని న‌వాబు అని చెప్పుకోలేం, మ‌నం న‌వాబులం కాదు బీకార్లం. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళ‌లు బ‌డి పిల్ల‌ల‌కు వండి పెడితే వాళ్ల‌కు కూడా డ‌బ్బులు ఇవ్వ‌లేదు. హాస్ట‌ళ్ల‌లో చ‌దువుకునే పిల్ల‌ల‌కు మైస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వ‌లేదు. అప్పుల‌తో పాటు అడ్డ‌గోలుగా త‌ప్పులు కూడా చేశాడు, ఢిల్లీకి పోయే ప‌రిస్థితి లేకుండా చేశాడు. 30 నెల‌ల్లో స‌మాజంలో గౌర‌వం పెంచుకుని, విధ్వంస‌మైన‌ తెలంగాణ‌ను వికాసం వైపు న‌డిపిస్తున్నాం. ఎప్పుడు ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నాం, త‌ప్పించుకుని తిర‌గ‌డం లేదు, ఫామ్ హౌస్ ల్లో ఉండ‌టం లేదని . సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

25.35 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ఇర‌వై వేల కోట్ల రైతు రుణ‌మాఫీ చేశాం. రైతు భ‌రోసా కింద ప్ర‌భుత్వం రాగానే 7 వేల కోట్ల రూపాయ‌లు చెల్లించాం. సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్ లో బ‌కాయిలు పెట్టిపోతే 2023 లో చెల్లించాం. రైతు భ‌రోసాను 12 వేల కు పెంచి ఇప్ప‌టి వ‌ర‌కు 27 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. ఈ విడుత తో క‌లిసి 36 వేల కోట్ల రైతు భ‌రోసా కింద చెల్లించాం. ఉచిత క‌రెంటు ను క‌నిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఉచిత క‌రెంటు కాంగ్రెస్ పార్టీ పెటెంట్. ఉచిత క‌రెంటు మాది అన్న సన్నాసుల‌ను ఆడ‌బిడ్డ‌లు చీపురుక‌ట్ట‌లు తిర‌గేసి కొడ‌త‌రు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు ఉచిత క‌రెంటుతో పాటు విద్యుత్ బ‌కాయిలను ర‌ద్దు చేస్తు సంత‌కం పెట్టారు. కాంగ్రెస్ వ‌స్తే క‌రెంటు క‌ష్టాలు అని ఇప్పుడు విమ‌ర్శిస్తున్నారు. నెల‌కు 1000 కోట్ల రూపాయ‌ల‌ను ఉచిత క‌రెంటు కోసం ఖ‌ర్చు చేస్తున్నాం, ఇప్ప‌టి వ‌ర‌కు 30 వేల కోట్లు ఖ‌ర్చు చేశాం. స‌న్న వ‌డ్ల‌ బోనస్ కోసం 4 వేల కోట్ల ఖ‌ర్చు చేశాం. మూడు న్న‌ర వేల కోట్ల రైతు బీమా కోసం ఖ‌ర్చు చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా డెబ్బై ఐదు వేల కోట్లు రైతుల కోసం ఖ‌ర్చు చేశాం, నెల‌కు 6 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం. బీఆర్ఎస్ హ‌యాంలో నెల‌కు కేవ‌లం రెండు వేల కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టారని సీఎం రేవంత్ విమర్శించారు.

రైతుల కోసం ప్ర‌త్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం, చ‌ర్చ‌కు సిద్ధ‌మా? ప‌దేళ్ల‌లో మీరు ఏం చేశారో, రెండున్న‌ర యేళ్ల‌లో మేం ఏం చేశామో చ‌ర్చ‌కు సిద్ధం. కాళేశ్వ‌రం కోసం ల‌క్షా రెండు వేల కోట్లు చెల్లిస్తే రెండేళ్ల‌లో కూలిపోయి కూలేశ్వ‌రం అయింది, డ‌బ్బులు గోదావ‌రి లో క‌లిసిపోయాయి. ఏ ఊరిలో రైతులు పంట‌లు పండించినా కాళేశ్వ‌రం నీళ్ల‌తోనే పండాయి అన్నారు. మూడేళ్ల‌లో కాళేశ్వ‌రం నుంచి చుక్క నీరు రాక‌పోయినా 2 కోట్ల 80 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతుల పండించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు.

కేసీఆర్.. ఎంత కాలం కాశీ మ‌జ‌లీ క‌థ‌లు చెపుతావు? ఆయ‌న క‌థ‌లు విన్న త‌ర్వాత తెలంగాణ ప్ర‌జ‌లు ఫామ్ హ‌స్ లో పెట్టారు. చిన్న రాక్ష‌సులు బయ‌లుదేరి కేసీఆర్ రావాల‌ని కోరుకుంటున్నార‌ని చెపుతున్నాడు. కేసీఆర్ రావాల‌ని ఎవ‌రు కోరుకుంటున్నారు? ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ చేయ‌లేదు, ద‌ళితుల‌కు మూడెక‌రాలు ఇవ్వ‌లేదు, కోటీ ఎక‌రాల‌కు నీళ్లు ఇస్తాన‌ని చెప్పి ఇవ్వ‌లేదు. అన్ని క‌ల్చ‌ర్ల‌ను స‌ర్వ‌నాశ‌నం చేసి తాగుడు క‌ల్చ‌ర్ పెట్టాడు. మేం రైతు బ‌జార్లు తెస్తే కేసీఆర్ బెల్ట్ బ‌జార్లు తెచ్చాడు. పిల్ల‌ల‌ను కూడా కేసీఆర్ తాగుబోతుల‌ను చేశాడు. ప్రతి పేద‌వాడి ఖాతాల్లో 15 ల‌క్ష‌లు వేస్తాన‌ని మోదీ చెప్పాడు. యేడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌న్నాడు, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వ‌చ్చాయా? తెలంగాణ‌లో బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డికి మాత్ర‌మే ఉద్యోగాలు ఇచ్చాడు. బీజేపీ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ వ‌చ్చే ప్ర‌భుత్వం మాదే అంటున్నాడు, ఏందీ వ‌చ్చేది? తెలంగాణ‌లో ఆట‌లు సాగ‌వని సీఏం రేవంత్ హెచ్చరించారు.

ప‌ద‌వీ విరమణ చేసిన ఉద్యోగుల‌కు 8 వేల కోట్ల బ‌కాయిలు పెట్టిపోయారు. ఆర్టీసీ 1000 కోట్ల లాభాల్లోకి వ‌చ్చింది, సింగ‌రేణి లాభాల్లోకి తెచ్చాం. ధ‌ర‌ణి ని బంగాళాఖాతంలో వేసి భూభార‌తి తెచ్చి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నాం. ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం క‌ల్పిస్తున్నాం, ఇప్ప‌టి వ‌ర‌కు 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆర్టీసీకి ప్ర‌భుత్వం చెల్లించింది. ఆర్టీసీ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం వ‌ద్ద‌ని ఆటో వాళ్ల‌ను రెచ్చగొట్టి ధ‌ర్నాలు చేయించే ప్ర‌య‌త్నం చేశారు. 1000 బ‌స్సులకు మ‌హిళా సంఘాల‌ను య‌జ‌మానుల‌ను చేశాం. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళ‌ల‌తో 1000 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ల‌ను పెట్టించాం. రిల‌యెన్స్ తో పోటీ ప‌డేలా మ‌హిళా సంఘాల‌తో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళల స్టాల్స్ కోసం 1000 కోట్ల రూపాయ‌ల విలువ చేసే స్థ‌లాన్ని శిల్పారామంలో కేటాయించామని తెలిపారు.

యాద‌య్య‌, యాదిరెడ్డి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్ట‌య్య లాంటి వాళ్లు తెలంగాణ కోసం ఆత్మ‌బ‌లిదానాలు చేసుకున్నారు. కేసీఆర్ త‌న ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మేం 30 నెల‌ల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ప్ర‌తి డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు భ‌ర్తీ చేశాం, మొద‌టి తారీఖునే జీతాలు ఇస్తున్నాం. దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు… నీ అయ్య జాగీరా, నీ తాత గ‌డీలు అనుకుంటున్న‌వా, గ‌డీల ముందు బానిస‌ల‌మా రాజీనామా చేయ‌డానికి? అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ‌రి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ‌రి పండించి నాలుగు వేల రెండువంద‌ల‌కు క్వింటా అమ్ముకున్నాడు. కేసీఆర్ మ‌ళ్లీ వ‌స్తే భార్య భ‌ర్త‌ల ఫోన్లు వింటాడు త‌ప్ప ఏమీ చేయ‌డు. పెళ్లాం మొగుడు మాట్లాడుకున్న మాట‌లు విన‌డానికి సిగ్గుండాలి. సొంత బిడ్డ కూడా నేను, నా భ‌ర్త మాట్లాడుకుంటు విన్నార‌ని చెప్పింది, ఇంకా ఎందుకు ఆ బ‌తుకు? పాపాల భైర‌వుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, మ‌ళ్లీ రావాలంట‌.. ఆయ‌న కోసం జ‌నం ఎదురు చూస్తున్నార‌ట‌ అంటూ ఎద్దేవా చేశారు.

ఉన్న‌ది ఉన్న‌ట్లు చెపుతా, చేసేది చెపుతా. కిరిటాలు పెట్టుకోవాలి, వ‌జ్ర వైడూర్యాలు సంపాదించాల‌ని నాకు లేదు. ప‌ద‌వి శాశ్వ‌తం కాదు, మాట శాశ్వ‌తం.. మాట కోసం ఎంత‌కైనా నిల‌బ‌డ‌తాడు అన్న పేరు కోసం ప్ర‌య‌త్నం. అబ‌ద్దాల పునాదుల‌పైన ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌ను. కాలానికి త‌గ్గ‌ట్లుగా రైతులు వ్యవ‌సాయాన్ని మార్చుకోవాలి. ఈ సారి వ‌ర్షాలు ప‌డ‌వ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు, వ‌ర్షాలను బ‌ట్టి పంటలు వేసుకోవాలి. 7 ర‌కాల స‌న్న వ‌డ్ల విత్త‌నాల‌ను రైతు వేదిక‌ల్లో అందుబాటులో ఉంచాం, డిమాండ్ ఉన్న స‌న్న వ‌డ్ల ను వేయమ‌ని రైతుల‌కు చెపుతున్నామని తెలిపారు.

ఒక్క నిజం చెప్పితే త‌ల‌కాయ వెయ్యి వ‌క్క‌లు అవుతుంద‌న్న శాపం క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి ఉన్న‌ట్లుంది. ఒక‌రికి మించి ఒక‌రు అబ‌ద్దాలు చెపుతున్నారు, కేసీఆర్ ను మించి అబ‌ద్దాలు చెపుతున్నారు. బుద్ది మార‌నంత వ‌ర‌కు దేవుడు వాళ్ల‌ను క్ష‌మించ‌రు. బ‌తుక‌మ్మ చీర‌ల‌ను జొన్న చేను కాడ పిట్ట‌లు కొట్ట‌డానికి క‌ట్టారు. మేం పెట్టిన చీర‌లను ఆడ‌బిడ్డ‌లు సంతోషంగా క‌ట్టుకుంటున్నారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయ‌లను రైతు భ‌రోసా కింద చెల్లిస్తాం, న‌గ‌దు సిద్ధం చేశాం. ఈ ప్ర‌భుత్వం మీది, ఈ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ది.. ప్ర‌భుత్వం రైతుల‌ది, ఆడ‌బిడ్డ‌ల‌ది, నిరుద్యోగుల‌ది. 5 వేల పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీ కి నోటిఫికేష‌న్ ఇస్తామంటే వ‌ద్ద‌ని అంటున్నారు. మూసీ వ‌ద్ద‌ని, మెట్రో వ‌ద్ద‌ని, రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు వ‌ద్ద‌ని అంటున్నారు. పోర్లు దండాలు పెట్టినా అన్ని ప‌నులు చేస్తా. ప్ర‌భుత్వాన్ని కాపాడుకునే బాధ్య‌త రైతుల‌ది. కేసీఆర్ లాంటి త‌ప్పుడు ప‌నులు మాత్రం మేం చేయం. ఎమ్ చేసినా చేయకపోయినా మేము భార్య‌భ‌ర్త‌లు మాట్లాడు కుంటే మాత్రం వినం. ఫామ్ హౌస్ లో ప‌శుప‌తిని బంధించాను, అరుంధ‌తి సినిమాలో రాక్షసుడిలా ఫామ్ హౌస్ లో రైతులు బంధించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *