పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాల్సిందే.. జులై 6న మహాధర్నాకు కూనంనేని పిలుపు..
MLA Kunamneni Sambasiva Rao
ప్రభుత్వ , భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదల ఇళ్ల స్థలాలకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని, పేదల ఇళ్ల స్థలాల కూల్చివేతలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పోరాటానికి సీపీఐ పిలుపునిచ్చింది. అన్ని వామపక్ష పార్టీలను కలుపుకొని జులై 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. అలాగే, జులై 6న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద భారీ ఎత్తున మహాధర్నా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలు రావాల్సిన వారు, ఇళ్లు కావాల్సిన నిరుపేదలంతా తమ దరఖాస్తులను సిద్ధం చేసుకొని ఈ పోరాటంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, గతంలో జరిగిన చారిత్రాత్మక విద్యుత్తు ఉద్యమం తరహాలోనే పేదలకు ఇళ్ల స్థలాల సాధన కోసం మరో ఉధృతమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం వామపక్షాలు వెనకడుగు వేయబోవని ఆయన పునరుద్ఘాటించారు.
ఇదే క్రమంలో సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాద బాధితుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సిగాచీ బాధిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కూనంనేని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, సదరు ఘటనలో గాయపడిన వారికి పూర్తి స్థాయి పరిహారంతో పాటు వైద్య ఖర్చులను కూడా యాజమాన్యమే భరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.