తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. నేటి నుంచే మారనున్న వాతావరణం.. పిడుగులు పడే ప్రమాదం!
Southwest Monsoon Makes Entry into Kerala, Advances Across Tamil Nadu
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో అర్థం కాని అనిశ్చితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ప్రవేశించినప్పటికీ కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురిశాయి. అయితే, నేటి నుండి ఇరు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడనుందని, తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్లలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక కీలక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు ,తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే ముప్పుతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఏపీలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణలో కూడా నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సెంట్రల్ ,దక్షిణ తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నుండి అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్లో కూడా పగటిపూట ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ముప్పు ఉందని వెదర్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసే వారు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.