డీకే శివకుమార్ ప్రభుత్వానికి షాక్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి గుడ్బై..కారణం ఏంటంటే..
Karnataka Minister Ramalinga Reddy Resigns Days After Joining Shivakumar Cabinet
కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గంలో బుధవారం నాడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ లేఖను సమర్పించారు.
ఈ ఆకస్మిక రాజీనామాకు మంత్రిత్వ శాఖల కేటాయింపులో జరిగిన తీరే కారణమని తెలుస్తోంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 13 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే, తనకు కేటాయించిన శాఖ పట్ల తీవ్ర నిరుత్సాహానికి గురైన రామలింగారెడ్డి ఆ బాధ్యతలను స్వీకరించడానికి నిరాకరించారు. ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన బహిరంగంగానే ఆరోపించారు.
తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే డీకే శివకుమార్ తన ఇంటికి వచ్చారని రామలింగారెడ్డి గుర్తుచేశారు. ఆ సమయంలో బెంగళూరు పట్టణాభివృద్ధి (బెంగళూరు డెవలప్మెంట్) శాఖను అప్పగిస్తానని స్వయంగా ఆయనే రెండు సార్లు వాగ్దానం చేశారని పేర్కొన్నారు. తాను సీఎంను ఎలాంటి పదవీ అడగకపోయినా ఆయనే స్వచ్ఛందంగా ఆ ఆఫర్ ఇచ్చారని, తీరా సమయానికి తనకు ఇష్టం లేని నీటిపారుదల (ఇరిగేషన్) శాఖను అప్పగించడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో స్పష్టం చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖ కోసమే రామలింగారెడ్డి పట్టుబట్టినప్పటికీ, ముఖ్యమంత్రి ఆ శాఖను ఆయనకు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడమే ఈ వివాదానికి దారితీసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దిగివచ్చి తనకు నచ్చిన శాఖను ఆఫర్ చేసినా, లేదా బెంగళూరు పోర్ట్ఫోలియోను కేటాయించినా తాను మంత్రి పదవిని తీసుకునే ప్రసక్తే లేదని రామలింగారెడ్డి తేల్చిచెప్పారు. ఇకపై తాను కేవలం శాసనసభ్యుడిగా (ఎమ్మెల్యేగా) మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే, పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు. ఈ పరిణామం కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను మరోసారి రోడ్డున పడేసింది.