Telangana Aasara Scheme: దారి తప్పిన ఆసరా…41 వేల మంది చనిపోయిన వారికి వృద్ధాప్య పింఛన్లు..
ai generated
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అర్హులైన వారికి సుమారు రెండు లక్షల మందికి ఆసరా పెన్షన్లను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, పెన్షన్ల పంపిణీలో భాగంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు, అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను దక్కాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడం చూడవచ్చు. ఇందులో భాగంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేసేందుకు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి వేలిముద్రలు, ఐరిస్ పరీక్షలు నిర్వహిస్తూ, లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. అయితే, ఈ విచారణలో సుమారు పదివేల మంది లబ్ధిదారుల ఆచూకీ లేకపోవడం గమనార్హం. వారి పేర్లపై ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 వేల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు మరణించినప్పటికీ, వారి పేర్లపై కుటుంబ సభ్యులు లేదా ఇతరులు పెన్షన్లు అందుకుంటున్నట్లు ఈ విచారణలో తేలింది. ముఖ్యంగా డూప్లికేట్, అలాగే చెల్లని గుర్తింపు కార్డుల కారణంగా మరో 10 వేల మందికి పైగా పెన్షన్లు వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు తెలంగాణలో ఆసరా పెన్షన్ ప్రతినెల పొందుతూ, పొరుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న మరో 3,500 మంది అనర్హులను కూడా అధికారులు గుర్తించారు. ఒకవేళ లబ్ధిదారులు కనుక మరణించినట్లయితే, వారి డెత్ సర్టిఫికెట్లను ఎమ్మార్వో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోవడం వల్లనే అక్రమంగా డబ్బులు డ్రా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటివరకు జరిపిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా అనర్హులు ఆసరా పెన్షన్ పొందుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చూడవచ్చు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 19,04,239 మంది పెన్షనర్లు ఉండగా, వారిలో ఇప్పటికే 15,97,233 మంది (83.88 శాతం) ఆథెంటికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇక జిల్లాల వారీగా చూసినట్లయితే, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 100% లైవ్ ఆథెంటికేషన్ సర్వే పూర్తయింది. ఇక రంగారెడ్డి జిల్లా 53%తో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 60 శాతంతో, హైదరాబాద్ జిల్లా 63%తో ధృవీకరణ ప్రక్రియలో అత్యంత నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
ఇక ఆచూకీలేని 10,000 మంది పెన్షన్ సొమ్మును ఇన్నాళ్లు ఎవరు డ్రా చేసుకున్నారనే అంశం పైన ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. అయితే, అనర్హులను ఏరివేస్తూనే ప్రజాధనాన్ని కాపాడుతూ, మరోవైపు అర్హులైన కొత్త లబ్ధిదారులకు అతి త్వరలోనే పెన్షన్లు అందేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.