Delhi Protest LIVE: ఢిల్లీలో సీజేపీ ఛలో పార్లమెంట్ ఉద్రిక్తం.. CJP నిరసనకారులపై లాఠీఛార్జ్..టియర్ గ్యాస్ ప్రయోగం..
ఢిల్లీలో మరో నిరసన.. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు మాజీ పోలీసులు పిలుపు
Delhi Protest LIVE: నీట్-యూజీ (NEET-UG) పరీక్షల అక్రమాలకు నిరసనగా.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన చలో పార్లమెంట్ మార్చ్ ఢిల్లీ వీధుల్లో తీవ్ర రణరంగంగా మారింది. జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వైపు దూసుకువస్తున్న వేలాది మంది సీజేపీ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది.
పార్లమెంట్కు సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న రైసినా రోడ్డు మార్గంలో ఉద్రిక్తత పీక్ స్టేజీకి చేరింది. ఆందోళనకారులు బారికేడ్లను తోసుకొని పార్లమెంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద పోలీసులు టియర్ గ్యాస్ (బాష్పవాయువు) ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. మరోవైపు సన్సద్ మార్గ్ రోడ్డులో వస్తున్న నిరసనకారులను సన్సద్ మార్గ్ పోలీసు స్టేషన్ వద్దే భారీ బారికేడ్లు పెట్టి పోలీసులు నిలువరించారు. సెంట్రల్ ఢిల్లీకి కీలకమైన వికాస్ మార్గ్లోని ఐటీవో (ITO) వద్ద కూడా నిరసనకారులను భారీగా బ్లాక్ చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ వద్దకు వేల సంఖ్యలో చేరుకున్న సీజేపీ కార్యకర్తలు బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేశాయి.
ఈ లాఠీఛార్జ్, తోపులాటలో పలువురు సీజేపీ కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన నిరసనకారులకు ఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. నిబంధనలను ఉల్లంఘించి పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన సుమారు 15 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నగరంలో ఇంటర్నెట్ సేవలను పరిమితం చేయగా, ఐదు కీలక మెట్రో స్టేషన్లను మూసివేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.