అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు..కీలక వివరాలు వెల్లడించిన మంత్రి నారాయణ..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులు, నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ కీలక వివరాలను వెల్లడించారు. రాజధానిలో భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడమే కాకుండా, భూముల కేటాయింపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతిలో ఇప్పటివరకు మొత్తం 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ సంస్థల్లో 70 ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే, ఈ మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని అనివార్య కారణాల వల్ల తమ భూ కేటాయింపులను రద్దు చేసుకోగా, మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన స్థలానికి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు.
సినీ పరిశ్రమ కేటాయింపులపై స్పందిస్తూ, అమరావతిలో స్టూడియోలు లేదా ఇతర సంస్థల స్థాపన కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు రాలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే, ముంబైకి చెందిన కొన్ని ప్రముఖ సినీ, వ్యాపార సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు, భూముల కోసం ఆసక్తి చూపిస్తూ ముందుకు వచ్చాయని ఆయన వెల్లడించారు.
రాజధానిలో భూములు కోరుతూ ముందుకు వచ్చే సంస్థల ఆర్థిక సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే కేటాయింపులు జరుపుతామని మంత్రి చెప్పారు. ఆయా సంస్థలు భూమిని వినియోగించుకుని సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయగలవా లేదా అని నిర్ధారించుకోవడానికి, వాటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లను సమర్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి వస్తున్న కొన్ని వదంతులను మంత్రి తోసిపుచ్చారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులకు ఎలాంటి డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా భారీ నిర్మాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినప్పటికీ.. అమరావతి అనేది రాష్ట్ర భవిష్యత్తు, మన ఏకైక రాజధాని కావడంతో పనులను ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని చెప్పారు.
రాజధాని కోసం 29 వేల మంది రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను త్యాగం చేశారని, కానీ గత ఐదేళ్ల కాలంలో అమరావతి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా పనులను నిలిపివేస్తే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని నారాయణ పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా, వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ రాజధాని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.