Skip to content
బిజినెస్ వార్తలు

Ethanol Petrol: ఈ20 పెట్రోల్‌  దెబ్బకు చక్కెర, కోడిగుడ్ల ధరలు పైపైకి..? కారణం ఇదే..?

Krishna Rao 28 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Ethanol Petrol: ఈ20 పెట్రోల్‌  దెబ్బకు చక్కెర, కోడిగుడ్ల ధరలు పైపైకి..? కారణం ఇదే..?

Ethanol Petrol: ఈ20 పెట్రోల్‌  దెబ్బకు చక్కెర, కోడిగుడ్ల ధరలు పైపైకి..? కారణం ఇదే..?

Ethanol Petrol: ఇంధన మార్కెట్లో E20 (20% ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వాడకం పట్ల వాహనదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండటంతో పాటు, ఆహార ధాన్యాలను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్ల దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాత వాహనాల ఇంజన్ సామర్థ్యం దెబ్బతింటోందన్న వార్తల నేపథ్యంలో E10 పెట్రోల్‌ను తిరిగి తెచ్చే అంశంపై ‘భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్’ (BPCL) సీఎండీ సంజయ్ ఖన్నా స్పందిస్తూ, ప్రస్తుతానికి E10 పెట్రోల్‌ను తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని 10% నుంచి 20%కి పెంచినప్పటికీ, వినియోగదారులకు లభించే పెట్రోల్ ధరల్లో ఎలాంటి తగ్గింపు ఉండటం లేదు. 

ఇంజన్లపై ప్రభావం: 

ఈ20 ఇంధనం వల్ల పాత వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు 100 పర్సెంట్ ప్యూర్ పెట్రోల్, సూపర్ పెట్రోల్ ధరలు రూ. 160 దాటాయి. ఇది కూడా సరిపడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు.

ఇథనాల్ కోసం ఆహార ధాన్యాల మళ్లింపుతో నిత్యావసరాల ధరల మంట: 

ఇథనాల్ తయారీకి చెరుకు, వరి ధాన్యం, మొక్కజొన్నను భారీగా తరలిస్తుండటంతో దేశీయ మార్కెట్‌లో ఆహార పదార్థాల కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగాయి.

బియ్యం ధరలు: గత కొంతకాలంగా 25 కిలోల బియ్యం బ్యాగ్‌పై రూ. 300 నుంచి రూ. 400 వరకు ధర పెరిగింది.

పంచదార ధరలు: ఇథనాల్ కోసం చెరుకు రసాన్ని మళ్లించడంతో పంచదార లభ్యత తగ్గి, కిలో ధర రూ. 41 నుంచి ఏకంగా రూ. 60 – రూ. 90 వరకు చేరింది. కేంద్ర ప్రభుత్వం రూ. 100% పన్ను మినహాయింపుతో మిలియన్ టన్నుల చక్కెర దిగుమతులకు అనుమతించింది. డి-మార్ట్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు చక్కెర అక్రమ నిల్వలను, అదనపు కొనుగోళ్లను అరికట్టడానికి ఒక్కో కస్టమర్‌కు 1 కిలో నుంచి గరిష్టంగా 5 కిలోల పరిమితి (Restrictions) విధించాయి.

కొండెక్కిన కోడిగుడ్లు, చికెన్ ధరలు: దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మొక్కజొన్నలో దాదాపు 37% నుంచి 40% వరకు ఇథనాల్ డిస్టిలరీలకే తరలిపోతోంది. పౌల్ట్రీ ఫీడ్ (దానా) కోసం వాడే మొక్కజొన్న ధర మూడేళ్ల క్రితం టన్నుకు రూ. 14,000 ఉండగా, ప్రస్తుతం రూ. 26,500కి చేరింది. గడిచిన ఏడాది కాలంలో కోడిగుడ్ల ధరలు 30% నుంచి 40% పెరిగాయి. ఫారమ్ వద్ద ఒక గుడ్డు ధర రూ. 7 ఉండగా, రీటైల్ మార్కెట్‌లో రూ. 8.50 నుంచి రూ. 9 వరకు విక్రయిస్తున్నారు. దీని ప్రభావం చికెన్ ధరలపై కూడా తీవ్రంగా పడుతోంది.

పర్యావరణ ముప్పు:

మరోవైపు ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల తీవ్రమైన గాలి, నీరు, నేల కాలుష్యం ఏర్పడుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో దాదాపు 29 ఇథనాల్ ఫ్యాక్టరీలకు అనుమతులు రాగా, వాటి ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు.

గద్వాల వద్ద పెద్ద ధన్వాడ, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ వంటి గ్రామాల్లో ఇథనాల్ యూనిట్లకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. చిత్తనూరు, మానకొండూర్ ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటైన ఫ్యాక్టరీల వల్ల స్థానికులు కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.