Skip to content
తెలంగాణ వార్తలు

Godavari Flood Surge at Polavaram: పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గేట్లు ఎత్తి వరద నీటి విడుదల

jagan 26 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Godavari Flood Surge at Polavaram: పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గేట్లు ఎత్తి వరద నీటి విడుదల

Godavari floods

Godavari Flood Surge at Polavaram: తెలంగాణతో పాటు గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది.

పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి నీటిమట్టం 30.30 మీటర్లకు, స్పిల్‌వే వద్ద 30.20 మీటర్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. వరద నీటిని నియంత్రించేందుకు స్పిల్‌వేకు చెందిన 48 గేట్లను ఎత్తివేసి, దిగువకు సుమారు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉద్ధృతితో దేవీపట్నం మండలంలోని ప్రముఖ గండిపోశమ్మ ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు, సమీపంలోని దుకాణాలు నీట మునిగాయి.

పి.గొందూరు నుంచి నాగులపల్లి మధ్య రహదారిపైకి కూడా వరద నీరు చేరడంతో ఆలయానికి వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.