Skip to content
బిజినెస్ వార్తలు

లావాదేవీలు రూ. 2 వేలు దాటితే ఛార్జీలు.. UPI చెల్లింపులపై కొత్త నిబంధనలు..

Prajapaksham 05 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
లావాదేవీలు రూ. 2 వేలు దాటితే ఛార్జీలు.. UPI చెల్లింపులపై కొత్త నిబంధనలు..

UPI

ఇండియాలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రూ.2,000కు పైబడిన యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా సర్వీస్ ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించేలా ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’కు సవరణ బిల్లును లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.

అయితే ఈ ప్రతిపాదనపై సామాన్య వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ (P2P) నగదు బదిలీలు, చిన్న వ్యాపారులకు చేసే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి అదనపు రుసుములు ఉండవని తెలిపారు.

ప్రతిపాదిత సవరణ ప్రకారం.. ఏడాదికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలకు జరిగే రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై మాత్రమే 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు MDR వర్తించే అవకాశం ఉంది. ఈ రుసుమును వినియోగదారులు కాకుండా వ్యాపారులే భరించాల్సి ఉంటుంది.

2020లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ‘జీరో MDR’ విధానం కారణంగా బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫిన్‌టెక్ సంస్థలకు యూపీఐ లావాదేవీల ద్వారా ఎలాంటి ఆదాయం లభించడం లేదు. దీంతో నెట్‌వర్క్ నిర్వహణ, సైబర్ భద్రత, సాంకేతిక మౌలిక వసతుల అభివృద్ధిపై భారీ ఆర్థిక భారం పడుతోందని పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో రూ.2,000కు పైబడిన యూపీఐ లావాదేవీలు మొత్తం లావాదేవీల సంఖ్యలో కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వాటి విలువ మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 65 శాతం ఉంటుందని ప్రభుత్వ అంచనా. ఈ కేటగిరీలోని పెద్ద వ్యాపార చెల్లింపులపై నామమాత్రపు MDR అమలు చేస్తే ఏటా సుమారు రూ.5,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని, ఆ నిధులను డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతుల బలోపేతానికి వినియోగించవచ్చని కేంద్రం భావిస్తోంది.

ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే తుది నిబంధనలు, MDR శాతం, అమలు విధానం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది సవరణ ప్రతిపాదన దశలోనే ఉండగా, తుది నిర్ణయంపై వ్యాపార వర్గాలు, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.