ఢిల్లీలో మరో నిరసన.. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు మాజీ పోలీసులు పిలుపు
ఢిల్లీలో మరో నిరసన.. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు మాజీ పోలీసులు పిలుపు
సీజేపీ (CJP) ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక పరిణామాలు… పోలీసు సిబ్బందిపై జరిగిన దాడులు, ఆ తర్వాత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర గందరగోళానికి, విస్తృత చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరీక్షల అవకతవకలు, నీట్ (NEET) పేపర్ లీక్కు వ్యతిరేకంగా జూలై 20న విద్యార్థులు, సీజేపీ ప్రతినిధులు పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు.
అయితే ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చి పోలీసులకు, నిరసనకారులకు మధ్య భారీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించగా.. నిరసనకారుల్లో చొరబడిన కొందరు సంఘ విద్రోహ శక్తులు తమపై ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారని భద్రతా దళాలు ఆరోపించాయి. ఈ పరస్పర తోపులాటలు, దాడుల్లో సుమారు 100 మందికి పైగా పోలీసు, పారామిలిటరీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ హింసాత్మక ఘటనకు నిరసనగా.. విధి నిర్వహణలో గాయపడిన భద్రతా సిబ్బందికి మద్దతుగా నిలిచేందుకు విశ్రాంత ఢిల్లీ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. పదవీ విరమణ చేసిన అధికారుల సంఘమైన ఢిల్లీ పోలీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 31న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు శాంతియుత నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న భద్రతా సిబ్బంది త్యాగాలను సమాజానికి ఎత్తిచూపడమే ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.
ఈ మేరకు జూలై 31న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్కు ఫెడరేషన్ ఒక లేఖను సమర్పించింది. చట్టాన్ని గౌరవించే పౌరులు, మాజీ అధికారుల తరఫున జరిగే ఈ కార్యక్రమం పూర్తిగా అహింసయుతంగా, నియమావళికి లోబడి జరుగుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు జూలై 20న విద్యార్థుల నిరసన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు తీవ్ర దురాగతాలకు పాల్పడ్డారని, చట్ట విరుద్ధంగా బలప్రయోగం చేశారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది.
నిరసనల సమయంలో పోలీసులు గతంలో ఉన్న మార్గదర్శకాలను పాటించడంలో విఫలమయ్యారని ఎత్తిచూపిన కోర్టు.. శాంతియుత ఆందోళనలు జరిగినప్పుడు పోలీసులు నడుచుకోవాల్సిన తీరుపై ఒక కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) లేదా కొత్త నియమావళి తక్షణమే అవసరమని స్పష్టం చేసింది.
శాంతిభద్రతల నిర్వహణ పేరుతో ఏ ఒక్కరూ హద్దులు దాటడానికి వీల్లేదని.. విద్యార్థుల ఆందోళనపై జరిగిన చర్యలపై సమగ్రమైన, స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరిమితులు దాటారో, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఇటువంటి విచారణలకు అర్థం ఉండదని వ్యాఖ్యానిస్తూ.. భవిష్యత్తులో నిరసనలను అదుపు చేసేటప్పుడు పోలీసులు అనుసరించాల్సిన పద్ధతులపై నూతన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఒకవైపు విశ్రాంత పోలీసుల నిరసన.. మరోవైపు సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలతో ఈ వ్యవహారం ఢిల్లీలో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.