Skip to content
తెలంగాణ వార్తలు

Tarimela Nagireddy: పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం తరిమెల నాగిరెడ్డి

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Tarimela Nagireddy: పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం తరిమెల నాగిరెడ్డి

Tarimela Nagireddy: పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం తరిమెల నాగిరెడ్డి

(జులై 28, నేడు తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా)

– చెరుకూరి సత్యనారాయణ

“ఇప్పటి వరకూ కమ్యూనిస్టులంటే నాకు చాలా చులకన భావం ఉండేది. ఈ రోజు నీ ఉపన్యాసం విన్న తర్వాత ఆ భావం పోవటమేగాక మీ పార్టీపై గౌరవభావం ఏర్పడింది” మద్రాసు నగరంలో 1952లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సిపిఐ నాయకులు తరిమెల నాగిరెడ్డి మూడు గంటలు ఉపన్యాసమిచ్చి అలసిపోయి క్వార్టర్సుకి వెళ్ళి నిద్రపోతుంటే ఆయన లేచిన దాకా వేచి ఉండి ప్రఖ్యాత చరిత్రకారులు, రచయిత వెల్లంపల్లి సోమశేఖర శర్మ గారన్న మాటలవి. ఆనాటి ఆందోళన ఫలితంగా కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర శాసనసభలో కూడా నాగిరెడ్డి గారే ప్రతిపక్ష నాయకులు. రాజాజీ, ప్రకాశం పంతులు లాంటి ఉద్దండులైన ముఖ్యమంత్రుల ముందు ప్రతిపక్ష నాయకునిగా అధికారపక్షంతో సమానంగా బలమున్న కమ్యూనిస్టు పక్షనాయకునిగా రాణించి అసాధారణమైన ప్రతిభ కన్పరచి ప్రజల జేజేలు అందుకున్న వ్యక్తి తరిమెల నాగిరెడ్డి.

తరిమెల నాగిరెడ్డి గారు ప్రముఖ పాత్రికేయులు విద్వాన్‌ విశ్వం గారితో కలిసి వారి స్వగ్రామం తరిమెల వీధి బడిలో చదివారు. జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన ఋషివ్యాలి స్కూలుకు ఆర్థికంగా భూరి విరాళమిచ్చిన నీలం చిన్నపరెడ్డి, తరిమెల సుబ్బారెడ్డి గార్లు వారి పెద్దకుమారులైన నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి గార్లని ఆ స్కూలులో చేర్పించారు. అక్కడి నుండి మద్రాసు అడయార్‌ (గిండీ)లోని థియోసాఫికల్‌ స్కూల్‌లో చేరిన నాగిరెడ్డి అనీబిసెంట్‌ స్వయం పర్యవేక్షణలో పెరిగారు. ఆ తర్వాత మద్రాసు లయోలా కాలేజీలో చదివారు. ఇక్కడే జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. లయోలా కాలేజ్‌ వాతావరణం జాతీయోద్యమానికి వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయంతో తర్వాత చదువులకు కాశీ (బెనారస్‌) హిందూ విశ్వ విద్యాలయానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి సుబ్బారెడ్డికి ఇష్టం లేకపోయినా ఆనాటి రాయలసీమ కాంగ్రెసు నాయకులు కల్లూరి సుబ్బారావు గారిని తోడుగా ఇచ్చి నాగిరెడ్డిని బెనారస్‌ పంపించాడు. నాగిరెడ్డితో పాటు నీలం రాజశేఖరరెడ్డి కూడా బెనారస్‌కి బయలు దేరాడు. వీరు బెనారస్‌ వెళ్తూ దారిలో వార్ధాలో దిగి గాంధీ ఆశ్రమానికి వెళ్ళారు.

నాగిరెడ్డి 1939లో బెనారస్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు నాగిరెడ్డే. అప్పటికే ఆయన అచ్యుత పట్వర్ధన్, కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాష్‌ నారాయణల వలన ప్రభావితుడై గాంధీ మార్గంపై విశ్వాసం సడలి, సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే శక్తి కమ్యూనిజానికి ఉందని నమ్మి పార్టీ సభ్యుడిగా మారాడు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు భరద్వాజ గారి ద్వారా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కమ్యూనిస్టు సాహిత్యం విరివిగా చదివాడు. లా డిగ్రీ తీసుకుని వచ్చి ప్రాక్టీసు చేస్తాడని ఆశతో అనంతపురం క్లాక్‌టవర్‌ సెంటర్‌లో పెద్ద మేడ కట్టించి ఎదురుచూస్తున్న ఆయన తండ్రి సుబ్బారెడ్డి లా డిగ్రీ లేకుండా రెండు ట్రంకు పెట్టెల నిండా కమ్యూనిస్టుల సాహిత్యం తీసుకుని రైలుదిగిన కుమారుణ్ణి చూసి హతాశుడయ్యాడు. ఇక తను ఊహించే స్థాయికి నాగిరెడ్డి పనికిరాడని నిర్ణయించుకొని తన అల్లుడు మేనల్లుడు అయిన నీలం సంజీవరెడ్డి ఎదుగుదలకు తోడ్పడాలని నిర్ణయించుకున్నాడు.

ఆ నిర్ణయంతో సుబ్బారెడ్డి కొడుక్కి, అతను నాయకునిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ, పార్టీకి అండగా ఉన్న తరిమెల గ్రామ పేద ప్రజలకు వ్యతిరేకంగా మారి, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ భూముల నుండి బేదఖల్‌ చేస్తూ అజ్ఞాతంలో ఉన్న నాగిరెడ్డిని పట్టుకునేందుకు కాపలా మనుషుల్ని ఏర్పాటు చేసి పార్టీ కదలికలు పోలీసులకు చేరవేస్తూ ప్రజా కంటకునిగా మారటంతో తండ్రిని చంపాలనే నిర్ణయానికి వచ్చిన నాగిరెడ్డి ఆ విషయాన్నే తెలియజేస్తూ తండ్రికి లేఖ రాశాడు. ఈ విషయాలన్నీ వివరిస్తూ సోదరుడు కృష్ణారెడ్డికి మరో ఉత్తరం రాస్తూ విషయాలన్నీ తల్లికి తెలియజేయమని కోరాడు. పార్టీలో కొందరు ఆమోదించనందున ఇతరత్రా కారణాల వలన సుబ్బారెడ్డిని చంపటం కార్యరూపం దాల్చలేదు. ఈలోగా ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గ్రామంలో బహిరంగ సభ జరిపి తన మామకు ఏమైనా హాని జరిగితే గ్రామంలోని కమ్యూనిస్టులందర్నీ కాల్చి చంపి, వారి గృహాల్ని నేలమట్టం చేస్తామని సంజీవరెడ్డి రెచ్చగొట్టాడు.

తండ్రికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిల్చిన నాగిరెడ్డి ప్రజా నాయకునిగా జిల్లాలో స్థిరపడ్డాడు. తర్వాతి కాలంలో ఎన్నికలు జరగటం 1952లో సంజీవరెడ్డిపై జైలు నుండే నాగిరెడ్డి గెలవటం, సురక్షితమైన అనంతపురం నియోజకవర్గం వదలి పుట్లూరు నియోజకవర్గానికి మారి 55 మధ్యంతర ఎన్నికల్లో నాగిరెడ్డి ఓడిపోయి 1957 ఎన్నికల్లో అనంతపురం నుండి పార్లమెంటుకి ఎన్నిక కావడం, 1962లో పుట్లూరు నుండే గెలవటం, 55, 62 రెండుసార్లూ తన కజిన్‌ రామచంద్రారెడ్డే ప్రత్యర్థిగా ఉండటం, 1967లో అనంతపురం నుండి శాసనసభకు ఎన్నికవ్వటం అంతా ఒక చరిత్ర. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలోనూ, కర్నూలు రాజధానిగా ఉన్న శాసనసభలోనూ ప్రతిపక్ష నాయకునిగా, 1962 తర్వాత ప్రతిపక్ష ఉపనాయకునిగా (గన్నవరం నుండి శాసనసభకు ఎన్నికైన సుందరయ్య గారు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు) 57 నుండి 62 వరకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన నాగిరెడ్డి 1966లో విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగానూ, 1969లో చట్టసభలపై విశ్వాసం కోల్పోయాననే కారణంతోనూ శాసన సభత్వానికి రాజీనామా చేశారు.

ట్యాగ్‌లు: Tarimela Nagireddy