Skip to content
తెలంగాణ వార్తలు

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ జూలై 3కి వాయిదా.. బాధితురాలికి హైకోర్టు నోటీసులు

Prajapaksham 01 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ జూలై 3కి వాయిదా.. బాధితురాలికి హైకోర్టు నోటీసులు

Bandi Bhagirath

పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఉభయ పక్షాల వాదనలను పరిశీలించి, తదుపరి నిర్ణయాన్ని ఎల్లుండికి (శుక్రవారానికి) వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా భగీరథ్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తన వాదనలు వినిపిస్తూ.. భగీరథ్‌పై నమోదైన ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తుకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నందున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే, ఈ పిటిషన్‌పై ఎలాంటి తుది నిర్ణయం తీసుకునే ముందైనా చట్టప్రకారం బాధితురాలి వివరణ, వాదనలు వినడం అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ బాధితురాలికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత కొద్దిరోజుల పాటు పరారైన అతడిని మే 16న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, ఇంజినీరింగ్ (BBA) పరీక్షలు రాసేందుకు వీలుగా గతంలో కోర్టు అతనికి కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పరీక్షల గడువు ముగియడంతో గత వారమే భగీరథ్ తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ దాఖలు చేసిన ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఎల్లుండి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *