ఎల్నినో ఎఫెక్ట్ మొదలు.. వాతావరణంలో భారీ మార్పుల హెచ్చరిక.. ప్రపంచ వాతావరణంపై ఆందోళన..
El Niño Has Begun, Could Become the Strongest This Century (Photo: AI Generated Image)
భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంపై ‘ఎల్నినో’ (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) ధ్రువీకరించింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ వాతావరణ మార్పులు రాబోయే రోజుల్లో మరింత బలపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర పరిధిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కాయని, ఇవి ఎల్నినో ఏర్పడటానికి కావలసిన కనీస పరిమితిని దాటేసినట్లు ‘ఇండియన్ ఓషన్ డైపోల్’ (IOD) తన తాజా బులెటిన్లో స్పష్టం చేసింది.
భారతదేశానికి చెందిన ‘మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్’ (MMCFS) అందించిన వాతావరణ నమూనాల ప్రకారం.. ఈ నైరుతి రుతుపవనాల సీజన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఎల్నినో తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉంది. భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంలోని అధిక భాగంలో కేవలం ఉపరితలమే కాకుండా, సముద్ర గర్భం (ఉపరితలం కింద) కూడా ఉష్ణోగ్రతలలో బలమైన సానుకూల క్రమరాహిత్యాలు (అధిక వేడి) ఉన్నట్లు ఐఎండీ గుర్తించింది. రాబోయే నెలల్లో ఈ వేడి నీరు నిరంతరాయంగా పైకి రావడం అనేది ఎల్నినో మరింత బలోపేతం కావడానికి స్పష్టమైన సంకేతమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఎల్నినో బలపడితే భారతదేశంలో రుతుపవనాలపై ప్రభావం పడి వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది.
అయితే, భారతదేశ రుతుపవన వర్షపాతాన్ని శాసించే ఏకైక అంశం ఎల్నినో మాత్రమే కాదని ఐఎండీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మన దేశ వాతావరణాన్ని ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన అంశమైన హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ప్రస్తుతం అక్కడ ‘తటస్థ ఇండియన్ ఓషన్ డైపోల్’ (Neutral IOD) పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తటస్థ పరిస్థితులు ఈ రుతుపవన సీజన్ పొడవునా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తటస్థ ఐఓడీ వల్ల ప్రస్తుత సంవత్సరంలో ఎల్నినో కలిగించే ప్రభావాలు గణనీయంగా పెరగడం కానీ, లేదా పూర్తిగా తగ్గిపోవడం కానీ జరగదని, దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని ఐఎండీ వివరించింది.