బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఐదు పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖ.. కొత్త పార్టీపై సస్పెన్స్..
Annamalai Submits Resignation, Sparks Speculation About Political Future
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై మంగళవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, తమిళనాడు పార్టీ ఇన్చార్జ్ నితిన్ నబిన్ను కలిసిన సందర్భంగా తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన జాతీయ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. నితిన్ నబిన్, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్లతో జరిగిన కీలక భేటీలో అన్నామలై పార్టీతో స్నేహపూర్వకంగా విడిపోవాలనే తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ఐదు పేజీల సుదీర్ఘ రాజీనామా లేఖను సమర్పించారు. తాను ఇకపై సొంత మార్గాన్ని నిర్దేశించుకోవాలనుకుంటున్నట్లు ఆయన పార్టీ హైకమాండ్కు స్పష్టం చేశారని న్యూస్ 18 వర్గాలు తెలిపాయి.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై స్థానంలో నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన పెద్దగా బయట కనిపించలేదు. అన్నామలైకు బీజేపీలో ఇకపై భవిష్యత్తు కనిపించడం లేదని, అందుకే ఆయన పార్టీతో సంబంధాలు తెంచుకోవాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా తీవ్ర ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే, ఈ మాజీ ఐపీఎస్ అధికారిని పార్టీలోనే కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా ఉన్నట్లు, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఢిల్లీని విడిచి వెళ్లవద్దని కోరినట్లు సమాచారం. కానీ, అన్నామలై తన నిర్ణయానికే కట్టుబడటంతో చివరకు బీజేపీ హైకమాండ్ ఆయన రాజీనామాకు అంగీకరించిందని తెలుస్తోంది. దీనిపై బుధవారం ఆయన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ వెండితెర నుండి నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్ది రోజులకే.. ఇప్పుడు బీజేపీ నుంచి అన్నామలై నిష్క్రమించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలకు దారితీయనుంది. అన్నామలైకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. నటుడు విజయ్ ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడంతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ను ఒంటరిగా ఎదుర్కొనే నాయకుడు రాష్ట్రంలో ఎవరూ లేరని, ద్రావిడ యుగం ముగిసిందని ఆయన భావిస్తున్నారు. కేవలం భాషా విద్వేషాలు, ప్రాంతీయ సెంటిమెంట్లపై కేంద్రీకృతమైన పాత తరం రాజకీయాలు ఇకపై పనిచేయవని, రాష్ట్ర రాజకీయాల శైలి మారిపోయిందని ఆయన నమ్ముతున్నారు.
మరోవైపు అన్నామలై మద్దతుదారులు మధురై వ్యాప్తంగా భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మా నాయకుడా, వచ్చి మమ్మల్ని నడిపించు అంటూ ఆ పోస్టర్లలో కోరారు. నిజానికి 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే (AIADMK) తో పొత్తును పునరుద్ధరించుకోవాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తున్న తరుణంలో, 2025లోనే అన్నామలైని తప్పించి నైనార్ నాగేంద్రన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. గతంలో ద్రావిడ దిగ్గజాలైన ఎంజీఆర్, జె. జయలలితలపై అన్నామలై చేసిన దూకుడు వ్యాఖ్యలు ఏఐఏడీఎంకేతో సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇది ఎన్నికల్లో రెండు పార్టీలకు నష్టం కలిగించడంతో అప్పట్లోనే బీజేపీ హైకమాండ్ అన్నామలైపై చర్యలు తీసుకుంది.
2020లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన అన్నామలై, తమిళనాడులో అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ఒక సరికొత్త ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, భవిష్యత్తులో అది సరికొత్త రాజకీయ పార్టీ రూపం దాలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అన్నామలై కూడా ఈ వార్తలను అటు ధృవీకరించలేదు, ఇటు ఖండించలేదు. రాబోయే రెండు రోజుల్లో తన తదుపరి కార్యాచరణను మరియు రాజకీయ వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పారు. కాగా, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కోయంబత్తూరు వ్యాప్తంగా ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, పోస్టర్లు ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.