కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక.. పేరును ప్రతిపాదించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర నూతన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తీవ్ర ఉత్కంఠ నడుమ ఆలస్యంగా ప్రారంభమైన సీఎల్పీ సమావేశంలో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించడం విశేషం. ఈ ప్రతిపాదనకు అక్కడ గూడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తన ప్రతిపాదన ప్రక్రియ ముగిసిన వెంటనే సిద్ధరామయ్య ఆ సమావేశం నుండి నిష్క్రమించారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ త్వరలోనే గవర్నర్ను కలిసి, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 3వ తేదీన ఆయన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టీ కొత్త మంత్రివర్గంపై పడింది. మంత్రి పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోరుగా లాబీయింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే చాలామంది శాసనసభ్యులు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబోయే సీఎం డీకే శివకుమార్తో పాటు సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ కూర్పుపై విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే మంత్రుల తుది జాబితా వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఈ మంత్రివర్గ విస్తరణ ఇద్దరు అగ్రనేతలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తమ తమ వర్గాలకు చెందిన సన్నిహిత ఎమ్మెల్యేలకు కీలక మంత్రి పదవులు దక్కేలా ఇటు సిద్ధరామయ్య, అటు డీకే శివకుమార్ అధిష్టానం వద్ద గట్టిగానే పట్టుబడుతున్నారు. ఈసారి కేబినెట్లో సీనియర్ల కంటే కొత్త ముఖాలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం గట్టిగా సాగుతుండటంతో, సిద్ధరామయ్య వర్గంలోని సీనియర్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ, ఆందోళన నెలకొన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.