Skip to content
జాతీయం వార్తలు

E20 Janta Party:  నెక్ట్స్ టార్గెట్ నితిన్ గడ్కరీ…సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన E20 జనతా పార్టీ..ఇథనాల్ బీజేపీ పుట్టి ముంచుతుందా..?

Prajapaksham 27 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
E20 Janta Party:  నెక్ట్స్ టార్గెట్ నితిన్ గడ్కరీ…సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన E20 జనతా పార్టీ..ఇథనాల్ బీజేపీ పుట్టి ముంచుతుందా..?

నీట్ పేపర్ లీక్ కుంభకోణంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చిన ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ స్పూర్తితో, ఇప్పుడు E20 జనతా పార్టీ పేరుతో మరో కొత్త సోషల్ మీడియా పార్టీ రంగంలోకి దిగింది. దాని ఏకైక డిమాండ్ చాలా సరళమైనది. ప్రభుత్వం తప్పనిసరి చేసిన E20 ఇథనాల్ మిశ్రమానికి బదులుగా, ప్రజలు తమ వాహనాల్లో వంద శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకునే వెసులుబాటును కల్పించాలన్నదే ఆ డిమాండ్.

ఈ పార్టీ ఆవిర్భావం  వెనుక సోషల్ మీడియాలో కస్టమర్ల ఆగ్రహం దాగి ఉంది. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో కేవలం E20 మాత్రమే అందుబాటులో ఉండటంతో, తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే హక్కును కోల్పోయామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇదే ఎంపిక స్వేచ్ఛను ఈ కొత్త ‘జనతా పార్టీ’ తిరిగి కోరుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అనుసరించిన మీమ్స్, చమత్కారాలతో కూడిన నిరసన శైలినే ఈ20 జనతా పార్టీ కూడా పాటిస్తూ, ఫ్యూయల్ ట్యాంక్ అసంతృప్తిని ఒక పూర్తిస్థాయి ఉద్యమంగా మారుస్తోంది. వ్యంగ్యం, దానికి తోడు భారీ సోషల్ మీడియా ప్రచారంతో ప్రభుత్వ ప్రణాళికలను మరోసారి కదిలించవచ్చని ఇది భావిస్తోంది.

ఒక సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ఈ20 జనతా పార్టీ అనేది పౌరుల నేతృత్వంలో నడుస్తున్న ఒక వినియోగదారుల హక్కుల ఉద్యమం. ఇంధన విధానంలో వినియోగదారులకు పారదర్శకత, సరైన సమాచారంతో కూడిన ఎంపిక, జవాబుదారీతనం లభించాలని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. పౌరులకు ఇతర ఉత్పత్తుల్లో రకరకాల ఆప్షన్లు ఉన్నట్లే, వారు కొనుగోలు చేసే ఇంధనాన్ని కూడా ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.

ఫ్యూయల్ స్టేషన్లలో మిశ్రమ ఇంధనాలతో పాటు వంద శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలన్నది వారి అత్యంత ముఖ్యమైన డిమాండ్లలో ఒకటి. తాము సబ్సిడీలు, ఉచిత ఇంధనం లేదా ఇథనాల్ మిశ్రమాలను పూర్తిగా తీసివేయాలని అడగడం లేదని, కేవలం తమకు కొనుగోలు చేసే ఎంపిక స్వేచ్ఛను మాత్రమే ఇమ్మని నిరసనకారులు కోరుతున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం, ఇంధన సామర్థ్యం, ఇంజిన్ అనుకూలత, నిర్వహణ ఖర్చులు  దీర్ఘకాలిక పనితీరుపై చాలా మంది వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కాకుండా, ఈ20 జనతా పార్టీ చేసిన ఇతర డిమాండ్లలో పారదర్శకమైన ఇంధన లేబులింగ్‌ను నిర్ధారించడం ఒకటి. అలాగే వివిధ ఇంధన మిశ్రమాల ఖర్చులు, ప్రయోజనాలు మరియు ప్రభావాలపై స్పష్టమైన డేటాను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నారు. మైలేజ్, ఇంజిన్ పనితీరు, ఉద్గారాలు నిర్వహణ ఖర్చులపై స్వతంత్ర అధ్యయనాలు నిర్వహించి, వాటి ఫలితాలను బహిరంగపరచాలని కోరుతున్నారు. పౌరులను ఒకే ఎంపికకు పరిమితం చేయకుండా, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా వారికి అవకాశం కల్పించాలని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ లాగే, ఈ20 జనతా పార్టీ కూడా మద్దతు కూడగట్టడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తోంది. మే 2026లో సిజెపి ఒక వ్యంగ్య సోషల్ మీడియా ఉద్యమంగా ప్రారంభమైంది. ప్రధాన డిమాండ్లకు సోషల్ మీడియా మీమ్స్‌ను జత చేస్తూ త్వరితగతిన యువజన ఉద్యమంగా మారి, తర్వాత జంతర్ మంతర్ వద్ద నిరసనలకు, రాజకీయ పరిణామాలకు దారితీసింది. మరోవైపు ప్రస్తుతం ఈ20 జనతా పార్టీ ఇంధన విధానానికి వ్యతిరేకంగా వినియోగదారుల హక్కులపై దృష్టి పెడుతోంది. అభిజీత్ దీప్కే నేతృత్వంలోని ఆ సంస్థను జాతీయ సంచలనంగా మార్చిన ట్రెండ్‌నే ఇది కూడా అనుసరిస్తోంది.

మే 16న దీప్కే చేసిన “బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది?” అనే పోస్ట్‌ను పంచుకుంటూ, “బైక్ లేదా కార్ యజమానులందరూ ఏకమైతే ఏమవుతుంది?” అని ఈ20 జనతా పార్టీ ప్రశ్నించింది. మరో పోస్ట్‌లో, ఈ20 మిశ్రమానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తమకు సహాయం చేయాలని వారు సిజెపి మరియు జెన్-జెడ్ యువతను కోరారు. అయితే, ఈ20 జనతా పార్టీకి సిజెపికి ఉన్నంత వ్యవస్థీకృత నిర్మాణం, ప్రత్యేక వ్యవస్థాపకుడు లేదా క్షేత్రస్థాయి ప్రాబల్యం ఇంకా ఏర్పడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సిజెపి విజయం సాధించిన తర్వాత రూపుదిద్దుకున్న ఒక డిజిటల్ నిరసన వేదిక ఇది.

ఇదిలా ఉంటే ఏప్రిల్ 1, 2026 నుండి భారతదేశమంతటా ఈ20 ఇంధనం ప్రామాణిక పెట్రోల్‌గా మారింది. ఈ చర్య ముడిచమురు దిగుమతులను తగ్గిస్తుందని, చెరకు రైతుల ఆదాయాలను పెంచుతుందని, ఉద్గారాలను తగ్గించి ఇంధన భద్రతను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ20 వల్ల మైలేజీ 8 నుండి 15 శాతం వరకు తగ్గిందని, పాత వాహనాల్లో ఇంజిన్ మొరాయించడం, రిపేర్ ఖర్చులు పెరిగాయని వాహన దారులు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు ఇథనాల్ తయారీ పరిశ్రమలతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. ఏది ఏమైనా, ఈ20కి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ డిజిటల్ నిరసన  క్రమంగా ఒక ప్రజా ఉద్యమంగా మారితే ఏమవుతుంది అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది. 

ట్యాగ్‌లు: CJP E20 Janta Party Indian Politics