లక్నో కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11మంది సజీవ దహనం..మరికొందరికి తీవ్ర గాయాలు..
Fire at Lucknow Coaching Centre Leaves Dead and Injured; Students Jump to Escape
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అత్యంత రద్దీగా ఉండే అలీగంజ్ ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 11 మంది సజీవ దహనమవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అలీగంజ్లోని ఒక బహుళ అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక దుకాణంలో (షాప్) మొదట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చూస్తుండగానే అత్యంత వేగంగా పైకి వ్యాపించి, అదే బిల్డింగ్లోని రెండో అంతస్తులో నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ను పూర్తిగా ముంచెత్తాయి. ఆ సమయంలో క్లాసుల్లో ఉన్న వందలాది మంది విద్యార్థులు దట్టమైన పొగ, మంటలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో భవనం నుండి బయటకు వచ్చేందుకు ఒకేసారి పరుగులు తీశారు.
మంటలు మెట్ల మార్గాన్ని కూడా కమ్మేయడంతో, లోపల చిక్కుకుపోయిన కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు కిటికీల గుండా, భవనం పైనుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భవనం లోపల మరియు వెలుపల తీవ్ర తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Fire Brgade) పలు ఫైర్ టెండర్లతో, స్థానిక పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానికులతో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం అగ్నిమాపక దళాలు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుండగా, దట్టమైన పొగతో నిండిపోయిన ఆ భవనం లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో రెస్క్యూ టీమ్స్ క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయి. గాయపడిన బాధితులను తక్షణ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.