ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్కు 100 సీట్లు ఖాయం.. బీజేపీ, బీఆర్ఎస్లపై మండిపడిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..
Mahesh Kumar Goud Says Congress Will Win 100 Seats in Next Elections
తెలంగాణ రాష్ట్రంలో మున్ముందు ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా అధికార కాంగ్రెస్ పార్టీ వంద స్థానాల్లో ఏకపక్షంగా ఘనవిజయం సాధించడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి హాజరైన ఆయన, పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేసే వ్యూహాత్మక లక్ష్యంతోనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని తలపెట్టినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మహేశ్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. పదేళ్ల పాటు సాగిన గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, తెలంగాణను ఎలా అప్పుల పాలు చేశారో ప్రజలు ఇంకా మర్చిపోలేదని, వారి అసలు రంగును జనం గమనిస్తూనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరిని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో ఓట్ల దొంగతనానికి పాల్పడటమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొడుతూ సీట్ల దొంగతనానికి కూడా బీజేపీ తెగబడుతోందని కఠినమైన ఆరోపణలు చేశారు. ఈ రాజకీయ కుట్రల్లో భాగంగానే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను సాంకేతిక కారణాలు సాకుగా చూపి కావాలనే కుతంత్రంతో తిరస్కరించారని ఆయన ఆక్షేపించారు.
గత పాలకుల వైఫల్యాలను అధిగమించి, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని టీపీసీసీ చీఫ్ కొనియాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ,మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల్లా కలిసికట్టుగా వేగంగా ముందుకు సాగుతున్నాయని, ఈ సుపరిపాలనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ భారీ మెజారిటీతో అధికారంలోకి తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో తిరుగులేని శక్తిగా మార్చేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వ ప్రజా రంజక నిర్ణయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.