US-Iran Tensions Rise: మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ దాడులకు అమెరికా ప్రతీకార దాడులు.. ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు..
US-Iran Tensions Rise: మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ దాడులకు అమెరికా ప్రతీకార దాడులు.. ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు..
అమెరికా – ఇరాన్ల మధ్య నెలకొన్న తాత్కాలిక శాంతి ఒప్పందం ముప్ఫై రోజులు కూడా గడవకముందే పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. హార్ముజ్ జలసంధి, ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడంతో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణపై ఆందోళన నెలకొంది. ఇరాన్పై అమెరికా చమురు ఆంక్షలను పునరుద్ధరించడంతో పాటు మళ్లీ దాడులకు దిగిందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో జూలై 8, 2026న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 75 డాలర్లను దాటగా.. డబ్ల్యూటీఐ ముడిచమురు ధర 72 డాలర్లను దాటి పరుగులు పెడుతోంది.
తాజా నివేదికల ప్రకారం ఖతార్ నుండి భారతదేశానికి 29 మంది నావికులతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై ఒమన్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో నావికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దాడిని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దీనికి తోడు సౌదీ అరేబియాకు చెందిన ఒక చమురు ట్యాంకర్ను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయనే ప్రచారం అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలను మరింతగా పెంచింది. ఈ దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్పై అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులను నిర్వహించింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) నేతృత్వంలో జరిగిన ఈ తాజా దాడుల్లో ఇరాన్లోని 80కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలను అమెరికా సేనలు ధ్వంసం చేశాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, తీరప్రాంత రాడార్ సైట్లు, కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్లతో పాటు హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న 60కి పైగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చిన్న పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ వైమానిక దాడుల వల్ల ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలైన బందర్ అబ్బాస్, సిరిక్ మరియు ఖేష్మ్ ఐలాండ్స్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన ప్రమాదకరమైన దాడులకు భారీ మూల్యం చెల్లించేలా చేయడానికే ఈ దాడులు చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం కీలక జలమార్గాలను తెరిచేందుకు ఇరుపక్షాలు అంగీకరించడంతో పాటు ఇరాన్ చమురు ఎగుమతులపై 60 రోజుల పాటు మినహాయింపు లభించింది. కానీ, వరుసగా ట్యాంకర్లపై దాడులు జరుగుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైట్హౌస్ ఇరాన్కు ఇచ్చిన చమురు లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పందం కుదిరిన నెల రోజుల్లోనే ఆంక్షలను తిరిగి విధించడంపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అమెరికా చర్యలకు తాము కూడా తగిన రీతిలో జవాబు ఇస్తామని స్పష్టం చేసింది.
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు రాజేసుకోవడం భారతదేశానికి కొత్త ఆర్థిక, రక్షణ సవాళ్లను విసిరేలా కనిపిస్తోంది. ఇటీవలే సాధారణ స్థాయికి చేరుకున్న ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్లు దాటడంతో భారతదేశ చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగి, దేశీయంగా ఇంధన ధరలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. దీనికి మించి భారతదేశానికి అత్యంత కీలకమైన ఆందోళన ఏమిటంటే ప్రధాన రవాణా జలమార్గాల మూసివేత ముప్పు. పశ్చిమ ఆసియా నుండి భారత్కు చమురు సరఫరాలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో, ఒకవేళ హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తే ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసు దెబ్బతినడంతో పాటు భారతదేశ ఇంధన భద్రతకు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది.