‘హైడ్రా’ భారీ ఆపరేషన్
ప్రజాపక్షం/హైదరాబాద్: చెరువుల ఆక్రమణలను తీవ్రంగా పరిగణిస్తున్న హైడ్రా అధికారులు మంగళవారం భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని మాధాపూర్ ఈదులకుంట, కోకాపేట కొత్త చెరువులపై జరిగిన ఆక్రమణలను గుర్తించి తొలగించారు. రెండు ప్రాంతాల్లో కలిపి దాదాపు 34 ఎకరాల భూమిని రక్షిస్తూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం రూ.4 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి, చెరువు పరిధిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. కారిడార్లోని మాధాపూర్ ప్రాంతంలో ఆక్రమణదారులు మాయం చేసే స్థితికి తీసుకెళ్లిన 6.05 ఎకరాల ఈదులకుంటను హైడ్రా గుర్తించి రక్షించింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామం సర్వే నెంబర్ 7లో ఉన్న ఈ చెరువు శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంటతో గొలుసుకట్టు విధానంలో అనుసంధానమై ఉండేది. వరద కాలువను మళ్లించడం వల్ల ఈదులకుంటకు నీరు చేరకుండా చేసి చెరువు హద్దులను చెరిపివేసే ప్రయత్నాలు జరిగినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతోకలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ రికార్డులు, రెవెన్యూ పత్రాలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్కడ 6.05 ఎకరాల చెరువు ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే చెరువు హద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువుకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 11/37లోని 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి విడిపించారు. దీంతో మొత్తం 11.21 ఎకరాల భూమి రక్షించారు. ఈ భూమి విలువ సుమారు రూ.1800 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఓవర్ల్యాపింగ్ వివాదాన్ని ఆసరాగా చేసుకున్న ఆక్రమణదారులు
కూకట్పల్లి, శేరిలింగంపల్లి మండలాల సరిహద్దుల్లో ఉండటం వల్ల ఈదులకుంట వివాదాస్పదంగా మారింది. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని నిర్మాణ సంస్థలు చెరువు భూమిలో నిర్మాణాలకు సిద్ధమయ్యాయి. కూకట్పల్లి మండలం పరిధిలోని సర్వే నెంబర్లు చూపిస్తూ 14 అంతస్తుల భవన నిర్మాణానికి 2022లో అనుమతులు పొందినట్లు అధికారులు గుర్తించారు. అయితే వాస్తవానికి నిర్మాణాలు చెరువు పరిధిలోనే సాగుతున్నాయని తేలింది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చెరువు, ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. అనంతరం మంగళవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూమిని రక్షించారు.

కోకాపేట కొత్త చెరువులో ఆక్రమణల తొలగింపు
గండిపేట మండలం కోకాపేట గ్రామంలోని కొత్త చెరువులో కూడా భారీ స్థాయిలో ఆక్రమణలు జరిగినట్లు హైడ్రా గుర్తించింది. 72 ఎకరాల ఎఫ్టిఎల్ పరిధి ఉన్న ఈ చెరువులో మధ్యగా కట్ట నిర్మించి ఎగువ ప్రాంతంలోని 20 ఎకరాలకు పైగా భూమిని కొందరు రియల్టర్లు ఆక్రమించినట్లు తేలింది. కొంతమంది ఫెన్సింగ్లు, మరికొందరు రేకుల ప్రహరీలు ఏర్పాటు చేసి చెరువు భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారు. గోల్డ్ ఫిష్ విల్లాల నిర్మాణ సంస్థ చెరువు పరిధిలో మట్టి పోసి బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, పిల్లల ప్లే ఏరియా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
సుమారు 1.09 ఎకరాల చెరువు భూమిలో జరిగిన ఈ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. అలాగే చెరువు ఎగువ భాగంలో ఉన్న 20 ఎకరాలకు పైగా ఆక్రమిత భూమిని కూడా స్వాధీనం చేసుకుని హద్దులు పాతారు. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. కోకాపేటలో మాత్రమే రూ.2200 కోట్ల విలువైన భూమిని రక్షించినట్లు అధికారులు
తెలిపారు.