Skip to content
తెలంగాణ వార్తలు

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో కీలక భేటీ..

jagan 02 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో కీలక భేటీ..

Revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, విమానాశ్రయాల అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ లక్ష్యంగా పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం వినతిపత్రాలు సమర్పించి చర్చలు జరిపారు.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించే ‘రక్షా ఎక్స్‌పో-2026’ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు, ఎయిర్ షో, డిఫెన్స్ ఎక్స్‌పో నిర్వహణకు అవసరమైన అనుమతులు, భారత వైమానిక దళ భాగస్వామ్యాన్ని అందించాలని కోరారు.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద డీఆర్‌డీఎల్ (DRDL) ప్రతిపాదిత ప్రాజెక్టుకు రూ. 1 నామమాత్రపు లీజుతో 416.18 ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సీఎం స్పష్టం చేశారు. అలాగే, ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని, రక్షణ శాఖ కోరిన విధంగా మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేయాలని, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్, ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, అనిల్ కుమార్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ట్యాగ్‌లు: Congress Revanth Reddy Telangana