టీటీడీలో అవినీతికి అంతం లేదా నారా లోకేష్.. ఆసుపత్రుల్లో మందులను కూడా వదలరా..
Bhumana vs nara Lokesh
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఐ కూటమి పాలనలో అవినీతి తీవ్ర స్థాయికి చేరుకుందని.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని కూడా వదిలిపెట్టకుండా పట్టి పీడిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగుతున్న ఈ శతాబ్దపు భారీ అవినీతి ఉదంతంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలోని ప్రసిద్ధ వైద్యశాలలైన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెర్చ్ ఫర్ డిసేబుల్డ్ (బర్డ్స్) ఆసుపత్రుల్లో తీవ్రస్థాయిలో గోల్మాల్ జరుగుతోందని ఆయన మండిపడ్డారు. పేద రోగుల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే ప్రాణరక్షక మందులు, అత్యవసర వైద్య పరికరాలు, శస్త్రచికిత్సలకు అవసరమైన సాధనాలు మరియు అత్యాధునిక భారీ వైద్య యంత్రాల కొనుగోళ్లలో రూ.కోట్ల నిధులు పక్కదోవ పడుతున్నాయని ఆరోపించారు.
వైద్య పరికరాల కొనుగోళ్లలో ఎల్1 (L1) టెండర్ల నిబంధనలను ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెరలేపారని భూమన విమర్శించారు. పెద్దల సమక్షంలోనే కొన్ని సరఫరా కంపెనీలతో ముందే లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బయటి మార్కెట్లో తక్కువ ధరకు లభించే సాధారణ నాణ్యత కలిగిన పరికరాలు, ఔషధాలను అత్యధిక ధరలకు టీటీడీ ఆసుపత్రులకు అంటగడుతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన టీటీడీ నిధులను స్వార్థ ప్రయోజనాల కోసం దారిమళ్లించడం దారుణమని అన్నారు.
రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ అమలు చేస్తున్న ‘రెడ్ బుక్’ రాజ్యాంగం వల్లే సర్వత్రా హింస, అవినీతి కరాళ నృత్యం చేస్తున్నాయని భూమన వ్యాఖ్యానించారు. పాలనా పరమైన పారదర్శకతను పక్కనబెట్టి, రాజకీయ కక్షసాధింపులు, ఆర్థిక దోపిడీకే ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వైద్య సంస్థల్లో పేదలకు అందాల్సిన వైద్య సేవలను వ్యాపారంగా మార్చేసి, రోగుల ప్రాణాలతో బేరసారాలు ఆడడం దిగజారుడు రాజకీయాకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
స్విమ్స్, బర్డ్స్ ఆసుపత్రులలో ప్రాణరక్షక మందులు, వైద్య యంత్రాల కొనుగోలు టెండర్ల వెనుక దాగి ఉన్న ఈ పెద్ద కుట్రపై తక్షణమే నిష్పాక్షికమైన సమగ్ర విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల కొనుగోళ్లలోని లొసుగులను బయటపెట్టి.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే బాధితులు, ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
- Bankipur Bypoll Result: బీజేపీ కంచుకోటను ప్రశాంత్ కిషోర్ ఎలా బద్దలు కొట్టాడు.. బంకీపూర్ ఉపఎన్నికల ఫలితాల్లో కాషాయం ఓటమికి కారణాలు ఏంటి..
- Bypoll Results 2026: గుజరాత్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు.. మంజల్పూర్లో వికసించిన కమలం, దతియాను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్..
- Bankipur Bypoll Result: బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషొర్ ఘన విజయం.. 30 ఏళ్ల బీజేపీ కంచు కోటను 30 రోజుల్లో బద్దలు కొట్టిన జన్ సూరజ్ పార్టీ అధినేత..
- Hyderabad Rain Alert: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త..రాత్రికి వాన కుమ్ముడే కుమ్ముడు.. అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక..
- టీటీడీలో అవినీతికి అంతం లేదా నారా లోకేష్.. ఆసుపత్రుల్లో మందులను కూడా వదలరా..